హైదరాబాద్ : మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు బీజేపీ డబ్బునే నమ్ముకుందని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భాను ప్రసాద్ ధ్వజమెత్తారు. డబ్బులతో ఓట్లను కొనేందుకు బీజేపీ చూస్తోందన్నారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులు.. బీజేపీకి తప్పకుండా బుద్ధి చెబుతారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.
టీఆర్ఎస్ఎల్పీలో భాను ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. నిన్న బీజేపీ నేత వద్ద రూ. కోటి దొరికాయి. మునుగోడు బీజేపీ ప్రవహింపజేస్తున్న ధనానికి ఆ ఘటనే నిదర్శనం అని చెప్పారు. బీజేపీ నాయకుల మాటలకు మునుగోడు ప్రజలు లొంగరని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు బేవకూఫ్ మాటలను బంద్ చేయాలన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు పార్టీలు మారడం సహజమన్నారు. తమ పార్టీలోకి కొంత మంది నేతలు వస్తారని పేర్కొన్నారు.
కేంద్ర మంత్రులకు సబ్జెక్ట్ లేదన్నారు. మిడి మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశ ప్రతిష్ఠను మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. ఏం మాట్లాడుతున్నారో ఆమెకే అర్థం కావడం లేదన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీ ఏం చేస్తుందో స్థానిక ప్రజలకు తెలుసన్నారు. కావాలంటే తెలంగాణ, ఆ రాష్ట్రాల అభివృద్ధిని పోల్చి చూడాలని భాను ప్రసాద్ పేర్కొన్నారు.