హైదరాబాద్ : ఈ దేశానికి కేసీఆరే శ్రీరామ రక్ష అని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ఎల్పీలో ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి కేపీ వివేకానంద మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర అట్టర్ ప్లాప్ అయిందని ధ్వజమెత్తారు.
బండి సంజయ్కు కేసీఆర్ పథకాలే దిక్కు అయ్యాయి. మోదీ పథకాలు ఏమీ లేవు కనుకే కేసీఆర్ పథకాలు కొనసాగిస్తామని బండి సంజయ్ అంటున్నారు. బండి దగ్గర సరుకు, సామర్థ్యం ఏమీ లేవని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా మారింది. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి నిన్న ఓ సాధ్వి లా కాకుండా అజ్ఞానిలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆమె శాఖనే తెలంగాణకు 13 అవార్డులిచ్చిందన్నారు. ఆ సంగతి సాధ్వికి తెలియకుంటే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని ఆ పార్టీ నేతలు పగటి కలలు కనడం మానుకోవాలని సూచించారు.