హైదరాబాద్ : కాంగ్రెస్ – బీజేపీలది పార్లమెంట్లో ముద్దులాట.. బయట గుద్దులాటలా ఉందని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి నిజామాబాద్ ఎంపీ కవిత గట్టిగా బదులిచ్చారని, ధాన్యం సేకరణపై వన్ నేషన్.. వన్ పాలసీ ఉండాలని డిమాండ్ చేశారన్నారు. నిజాయితీగా పోరాటం చేస్తున్నది టీఆర్ఎస్ ఎంపీలేనన్నారు. రైతుల కోసం స్వయంగా సీఎం కేసీఆర్ ధర్నాకు దిగితే రాహుల్కు కనబడడం లేదా? అని ప్రశ్నించారు.
ఇన్నాళ్లకు రాహుల్కు తెలంగాణ రైతులు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్లో మోదీని ముద్దుపెట్టుకున్న రాహుల్ మాకు నీతులు చెప్పడమా?.. రైతులతో మేం రాజకీయం చేయడం లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలే చేస్తున్నాయని, రాహుల్కు తెలంగాణ ఓట్ల మీద ప్రేమ ఉంది కానీ.. తెలంగాణ వడ్ల మీద లేదన్నారు. రాహుల్, రేవంత్లు కాంగ్రెస్ పాలిట జంట ఐరన్ లెగ్లు అనీ.. రాహుల్ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కాంగ్రెస్ నాశనమే నని, ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో చూశామన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ఏ ఉద్యమాలు చేసిందో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీ నాన్ సెన్స్, రేవంత్ న్యూసెన్స్లా మారారన్నారు. గాంధీ భవన్ను రేవంత్ కుస్తీ భవన్గా మార్చారన్నారు.
పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచి ఏడేళ్లలో రూ.23లక్షల కోట్ల కేంద్రం దండుకుందని, ఇంత పెద్ద మొత్తం జమ చేసుకున్న కేంద్రం తెలంగాణ రైతుల దగ్గర వడ్లు కొనలేని స్థితిలో ఉందన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావని, తెలంగాణ రైతులపై రాహుల్కు ప్రేమ ఉంటే టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి పార్లమెంట్లో పోరాడాలన్నారు. బాయిల్డ్ రైస్పై ఒప్పందం రాకెట్ సైన్స్ కాదు.. మార్చు కోవచ్చు .. మాకు రాజీనామాలు కొత్త కాదన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేస్తే అభ్యంతరం లేదని, కాంగ్రెస్ బీజేపీలు పార్లమెంట్లో స్వీట్లు, బయట ట్వీట్లు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.