హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు త్రీఫేజ్ కరెంట్ మాదిరి శక్తిమంతుడని.. ఆయన పవర్ను తట్టుకోవడం బీజేపీ నేతలకు సాధ్యంకాదని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి అన్నారు. కేసీఆర్ను ముట్టుకొంటే.. తెలంగాణ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీలో మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి గంగిరెద్దుల మాదిరిగా బీజేపీ నేతలు రాష్ట్రంలో ఒక్కో జిల్లాకు వచ్చిపోతున్నారన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, దొడ్దిదారిన మధ్యప్రదేశ్ సీఎం అయిన శివరాజ్సింగ్ చౌహాన్, అసత్యప్రచారాలకు కేరాఫ్గా మారి ఫేస్బుక్, ట్విట్టర్ సహా అనేక సామాజిక మాధ్యమాల్లో నిషేధానికి గురైన అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ఛత్తీస్గఢ్లో ఓడిపోయిన రమణ్సింగ్, ఆయన జీవితకాలంలో వార్డు మెంబర్గా కూడా గెలవని మురళీధర్రావు.. సంజయ్ సర్కస్ కంపెనీ జోకర్లు రాష్ర్టానికి వచ్చిపోతున్నారని ఆయన ఎద్దేశాచేశారు. పాలమూరు వలసలను నిలువరించటమే కాకుండా పొట్టచేతపట్టుకొని దేశంలో వివిధ ప్రాంతాలకు వలసవెళ్లిన లక్షల మంది.. సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాల భరోసాతో తిరిగి వచ్చిన సంగతి మురళీధర్రావుకు ఏం తెలుసని ప్రశ్నించారు. నలుగురు బీజేపీ ఎంపీలున్నా రాష్ర్టానికి ఏం తెచ్చారని నిలదీశారు. బీజేపీ నేతలకు అభివృద్ధి చూసే కండ్లు లేవని, వారికున్నది కేవలం కుళ్లు అని వ్యాఖ్యానించారు. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలని కోరుతున్న విషయం తెలుసుకొని మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్ తన పర్యటనను రద్దు చేసుకొన్నారని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ను టచ్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని, అందులో బీజేపీ మాడి మసైపోతుందని జీవన్రెడ్డి అన్నారు. తాము తలచుకుంటే బీజేపీ నేతలు అడుగు తీసి అడుగు వేయలేరని హెచ్చరించారు. ఉద్యమనేత సీఎం కేసీఆర్ను జైల్లో పెడతాం.. అవినీతిపరుడు వంటి అసత్యాలు ప్రచారం చేస్తే ఇక నుంచి తాము చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. బీజేపీ దిగుమతి నేతలు ఎంతమంది ఎన్ని వేషాలు వేసినా.. రాష్ట్రంలో 2023లో అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని తేల్చిచెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే కేసీఆర్ పథకాలను ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో బీజేపీ మ్యానిఫెస్టోలో పెట్టాలని డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు అదేపనిగా అసత్యాలు ప్రచారం చేయటం ఆపకుంటే యూపీలో ఆ పార్టీ భరతం పడతామని హెచ్చరించారు. యూపీ ప్రజలు కేసీఆర్ లాంటివారు తమకు కావాలని, తెలంగాణ మాదిరిగా తమ రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఉండాలని కోరుతున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మంత్రులు, ఇతర నేతలు యూపీకి వెళ్లి తెలంగాణ జరిగిన అభివృద్ధిని యూపీలో ఎందుకు చేయలేదో ప్రశ్నించాలని అక్కడి ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సుపారీకి కేరాఫ్, బ్రాండ్ అంబాసిడర్ అని జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీతో కుమ్మక్కై ఆ పార్టీ నుంచి సుపారీ తీసుకొన్నాడని, ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అదే చేశాడని ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర సుపారీ తీసుకొని తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తాడని, రేవంతే అసలైన బీజేపీ బీ-టీమ్ అన్నారు. ఆర్టీఐతో సమాచారం సేకరించి కోట్ల్ల రూపాయలను దోచుకొన్న కిలాడీ టీమ్కు రేవంతే లీడర్ అని మండిపడ్డారు.