పెద్దపల్లి : పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు అనునిత్యం అసత్యాలు, అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, అసలు ఆయనకు బుద్ధి, జ్ఞానం ఉందా..? అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మండిపడ్డారు. ప్రమాణాలు.. విమానాలు కాదు నిజాయితీ కావాలని ఇలాంటి పిచ్చి ప్రేలాపనలు మానుకోవాలని రమణారావును హెచ్చరించారు. సోమవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు.
తప్పులు చేసి ప్రమాణాలు చేస్తే సరిపోతుందా..? ఏదైనా ఆరోపణ చేస్తే చట్ట ప్రకారం నిరూపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఒక మాజీ ఎమ్మేల్యేగా నీకు దమ్ము, ధైర్యం ఉంటే ఇసుక రీచ్లపై, మట్టిపై, రియల్ ఎస్టేట్పై ఆధారాలతో నిరూపించాలి తప్ప ఆధారాలు లేని ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మసులుకోవాలని సూచించారు.
ప్రభుత్వమే ఇసుక రీచ్లను నిర్వహిస్తుంది తప్ప దాసరి మనోహర్ రెడ్డి కాదు అన్నారు. మానేరు తీర గ్రామాల ప్రజలకు ఇసుకకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇసుక తీసుకోవడానికి స్థానిక పంచాయతీ కార్యదర్శి ద్వారా అనుమతులు తీసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే రెండుసార్లు పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు నీకు గుణపాఠం చెప్పారని, ప్రజాక్షేత్రంలో ప్రజలన్ని గమనిస్తున్నారని, మరోసారి ఇలాంటి పిచ్చి ప్రేలాపనలకు దిగితే ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదన్నారు. ఎమ్మెల్యేగా ఐదేండ్లలో ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమంపై వైట్ పేపర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. తన హయాంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి, సంక్షేమం, ప్రత్యేక అభివృద్ధి పూర్తిగా వివరిస్తానని ఎమ్మెల్యే దాసరి స్పష్టం చేశారు. విజయ రమణారావుకు మరోసారి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని ఆయన హితవు పలికారు. ఈ విలేకరుల సమావేశంలో పెద్దపల్లి జడ్పీటీసీ రామ్మూర్తి, టీఆర్ఎస్ నాయకులు బండారి శ్రీనివాస్ బాలాజీ రావు, నూనె సంపత్లతో పాటు పలువురు పాల్గొన్నారు.