హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణను గుంజుకోవడానికి ఆయన అబ్బ సొమ్ము కాదన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు తల, తోక ఉండవు అని ధ్వజమెత్తారు. తమ నాయకులు కేసీఆర్, కేటీఆర్ను విమర్శిస్తే సహించమని దానం తేల్చిచెప్పారు.
నా ఇంటికి ఏ పార్టీ నాయకుడైన రావాలనుకుంటే.. కచ్చితంగా గులాబీ కండువాతోనే రావాలి అని దానం నాగేందర్ సూచించారు. అప్పుడే వారికి ఇంట్లోకి ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేశారు. గులాబీ కండువాను నమ్ముకున్నాం. టీఆర్ఎస్ పార్టీ వల్లే హైదరాబాద్ సిటీ గర్వంగా ఉందన్నారు. నగర ప్రజలు సంతోషంగా ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేసేందుకు యత్నిస్తున్నాయి.
రాబోయే రోజుల్లో ఇతర పార్టీలకు పుట్టగతులుండవు అని ఎమ్మెల్యే దానం స్పష్టం చేశారు. కాంగ్రెస్ సీనియర్లు ఆ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో చేరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఈ పార్టీకి ధీటుగా పుట్టేవాడే లేడు.. పుట్టబోడు అని పేర్కొన్నారు. శ్వాస ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతాను. కేసీఆర్ నాయకత్వంలో కష్టపడి పని చేస్తాను అని ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పష్టం చేశారు.