హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ గతంలో చెప్పినట్టుగా రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంతో కొనుగోలు చేయించాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ డిమాండ్ చేశారు. రైతులను రెచ్చగొడుతూ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశంతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ.. యాసంగిలో వరి సాగు చేయండంటూ రెచ్చగొట్టిన బీజేపీ నేతలు ఇప్పుడు రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేత కొనిపిస్తామని గతంలో ప్రగల్భాలు పలికిన నేతలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే కొనాలంటూ మాటమారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రైతుల పట్ల, బీజేపీయేతర రాష్ర్టాల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
నూకలు అలవాటు చేయండంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర బీజేపీ నేతలు వెనకేసుకొని రావడం శోచనీయమని చెప్పారు.గోయల్ వ్యాఖ్యల వీడియోను చూపించాలంటూ బండి సంజయ్ అడగడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ధాన్యం సేకరణ విషయంలో కేంద్రం దుర్మార్గంగా, రైతుల పొట్టగొట్టేవిధంగా వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు. తెలంగాణలో ధాన్యం ఉత్పత్తి 400 రెట్లు పెరగడం ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాలకు నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ గంజాయి సంజయ్గా, సదువు రాని సన్నాసి లాగా మాట్లాడొద్దని హితవు చెప్పారు. వంద శాతం ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే దాకా తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.
పేదల పాలిట జలగ బీజేపీ: మెతుకు ఆనంద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదల పాలిట పెద్ద జలగలా మారిందని, ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన తరువాత గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ విమర్శించారు. ధాన్యం కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గోయల్కు వ్యవసాయం తెలియదు: యెగ్గె మల్లేశం
గోయల్కు వ్యాపారం తప్ప వ్యవసాయం తెలియదని ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు చిల్లర రాజకీయాలు మాని, కేంద్రం ద్వారా ధాన్యం కొనుగోలు చేయించాలని సూచించారు.