హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): పార్టీని నడిపించుడు చేతకాక అధ్యక్ష పదవిని వదిలేసుకున్న రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణకు వచ్చి పొడిచేదేమిటని ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఎద్దేవా చేశారు. అమరవీరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పకుండా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చే ధైర్యం రాహుల్గాంధీకి ఉందా? అని సవాల్ విసిరారు. హెచ్ఐసీసీలో మంగళవారం బాల్కసుమన్, గువ్వల బాలరాజ్ మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్లో రాహుల్గాంధీ దిగగానే డ్రగ్స్ టెస్ట్ కోసం ఆయన వెంట్రుకలు ఇప్పించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని సుమన్ డిమాండ్ చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ నేతల్లారా.. రైతుల పేరిట రాజకీయాలు చేసుడు బంద్ జేయుండ్రి. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో ఓడిపోతానని తెలిసి కేరళకు పారిపోయిండు మీ రాహుల్గాంధీ. అమ్మకు అన్నం పెట్టనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు కొనిస్తానన్నట్టుగా ఇవాళ తెలంగాణకు రాహుల్గాంధీ వచ్చి ఉద్ధరిస్తానంటే నమ్మడానికి ప్రజలు అమాయకులు కాదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటగా ఉత్తర భారతదేశంలో మునిగిపోతున్న కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని హితవు చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడేముందు కాంగ్రెస్ నాయకులు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని హెచ్చరించారు.
బట్టేబాజ్ బండి : విప్ గువ్వల బాలరాజు
పిచ్చిపట్టిన కుక్కలాగా బండి సంజయ్ మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారని విప్ బాలరాజు విమర్శించారు. గుళ్ల దగ్గర పూజలు చేసి ప్రజలను మతం వైపు మళ్లించడం కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎందుకు జాతీయ హోదా కల్పించలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్ బట్టేబాజ్ నాయకుడని వ్యాఖ్యానించారు. కనీస అంశాలపై అవగాహనలేని వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయాలని మాట్లాడటం బీజేపీ నాయకుల అపరిపక్వతకు నిదర్శనమని దుయ్యబట్టారు.
అభివృద్ధి గురించి కాకుండా కుల మతాల గురించి మాట్లాడే చరిత్ర బీజేపీ నాయకులదని మండిపడ్డారు. తెలంగాణ లౌకిక రాష్ట్రమని, ఇక్కడ హిందువులు, ముస్లింలు భాయీభాయీ అని బతుకుతారని అన్నారు. ఇక్కడ గుజరాత్ సంస్కృతిని ప్రవేశపెట్టే కుట్రలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలిస్తానని మోదీ ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని అన్నారు. సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడమే కాకుండా నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేశారని చెప్పారు. యువతను పెడదారి పట్టించడం బీజేపీ అలవాటని విమర్శించారు. తమ పార్టీ నాయకులపై అవాకులు చవాకులు పేలితే అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు.
నాకు, రాహుల్కు పోలికేలేదు..!
‘మీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని ఓడించి గెలిచిన చరిత్ర నాది. మా జీవితంలో ఇప్పటివరకు ఓటమి లేదు. మీ రాహుల్గాంధీ అమేథీలో ఓడిపోయిండు. అది మీ చరిత్ర. మేం ఎప్పటకీ కేసీఆర్ శిష్యులమే. నన్ను తిరగనివ్వను అని జగ్గారెడ్డి మాట్లాడుతుండు. అస్సలు మేం తలుచుకుంటే జగ్గారెడ్డి, రేవంత్రెడ్డి తిరగగలరా? మీరు ఇంకా అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు’ అని బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలలో ఒక్కటైనా కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలలో అమలు చేస్తున్నారా అని నిలదీశారు.