హైదరాబాద్, జూలై 3, (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, ప్రధాని నరేంద్రమోదీ సభతో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రశ్నించారు. బీజేపీ టూరిస్టులు ఎప్పటిలాగే రాష్ర్టానికి వచ్చి వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రజలు విశ్వసించని మీ విశ్వగురువు (మోదీ) జపానికి, ఉత్త ముచ్చట్లకే పరిమితమైన ఈ సమావేశాలతో మీరు సాధించింది, ఉద్ధరించింది ఏమిటని నిలదీశారు. గుజరాతీలకు గులాం గిరీ చేస్తూ బాంచన్ దొరా అని పొర్లుదండాలు పెట్టే తెలంగాణ బీజేపీ నేతలు రాష్ర్టానికి రావాల్సిన నిధుల గురించి మోదీని అడగలేక పోయారా? అని ప్రశ్నించారు. వరదలతో హైదరాబాద్ అతలాకుతలమైనప్పుడు ఒక రూపాయి సాయం చేయని మీరు అదే గడ్డపై సమావేశాన్ని పెట్టుకోడానికి సిగ్గు అనిపించలేదా? అని విమర్శించారు.
ఈ సభలు సమావేశాలు మధ్యతరగతి ప్రజలను ముంచినందుకా? లేక దేశాన్ని అదానీ, అంబానీలకు అమ్మేసినందుకా? అని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మోదీ తోక ముడిచి పారిపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో సంపద పెరిగిందా? పేదరికం తగ్గిందా? యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయా? విద్యారంగం బాగుపడిందా? ఉచితంగా వైద్యం అందిస్తున్నారా? ప్రభుత్వ సంస్థలను స్థాపించారా? ప్రైవేట్ రంగాన్ని కట్టడి చేయగలిగారా? పెట్రోల్, గ్యాస్ రేట్లు తగ్గించారా? నిత్యావసర వస్తువుల ధరలను అందుబాటులోకి తెచ్చారా? అని నిలదీశారు.
కేంద్రం నుంచి బకాయిలను తీసుకురాగలరా?
బీజేపీ నేతలకు చేతనైతే కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన రూ.7,103.24 కోట్ల బకాయిలు తీసుకురావాలని బాల్క సుమన్ సవాల్ విసిరారు. దేశాన్ని తిరోగమనం వైపు నడిపిస్తున్న బీజేపీ మెడలు వంచాలన్నా.. దేశాన్ని మళ్లీ పురోగమనం వైపు నడిపించాలన్నా కేసీఆర్తో మాత్రమే సాధ్యమని పేర్కొన్నారు. ఢిల్లీలో కేసీఆర్ అడుగుపెడితే కేంద్ర పాలకుల పీఠాలకు బీటలు వారడం ఖాయమని హెచ్చరించారు.