హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి పార్టీ జాతీయ కార్యాలయం ప్రారంభం సందర్భంగా తెలంగాణకు చెందిన రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి పయనమయ్యారు. ముఖ్యమంత్రి, భారాస అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం ఢిల్లీలో చేసే రాజ శ్యామల యాగం, కార్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు బయలు దేరారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు మంగళవారం ఢిల్లీకి బయలుదేరిన వారిలో ఉన్నారు.
ఢిల్లీకి వెళ్తున్న బీఆర్ఎస్ నేతలతో శంషాబాద్ విమానాశ్రయం సందడిగా మారింది. ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీగా మారి, ఇపుడు జాతీయ పార్టీగా అవతరించనున్న సందర్భంగా నాయకులు విజయ సంకేతం చూపుతూ ఉత్సాహంగా ఢిల్లీకి బయలు దేరారు.