ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ఆందోళన ఇదే ప్రథమం
తెలంగాణభవన్ దారుల్లో నినాదాల హోరు
ఎకడచూసినా కేంద్రాన్ని నిలదీస్తూ పోస్టర్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రైతులు పండించిన యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలుచేయాలన్న డిమాండ్తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష విజయవంతమైంది. తెలంగాణ నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతలతో తెలంగాణభవన్ పరిసరాలు నిండిపోయాయి. దేశ రాజధానిలో ఒక రాష్ట్రం, అందునా దక్షిణాది రాష్ట్రం ఈ స్థాయి ఆందోళన చేపట్టడం ఇదే తొలిసారి అని స్థానికులు చెప్తున్నారు. తెలంగాణభవన్కు వెళ్లే దారులన్నీ రైతులు, రైతు సంఘాల నేతలు, ప్రజాప్రతినిధుల నినాదాలతో హోరెత్తాయి. ‘చాయ్ వాలా.. చావల్ లే లో.. ’ అంటూ నినదించారు. ‘మేం కూడా భారతదేశంలో అంతర్భాగమే. మా వడ్లను కొనండి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పలువురు నేతలు నాగలి, వరి కంకులను చేతబట్టుకొని దీక్షా స్థలికి వచ్చారు. సింగరేణి కార్మికులు కొంతమంది యూనిఫారంతో వచ్చి రైతులకు మద్దతు ప్రకటించారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
సీఎం కేసీఆర్ సభా ప్రాంగాణానికి చేరుకోగానే దీక్షా వేదిక వద్ద ఉన్న వారంతా గౌరవ సూచకంగా లేచి నిలబడ్డారు. ముఖ్యమంత్రి, జాతీయ రైతుసంఘాల ప్రతినిధులు కూర్చున్న వేదికను వరి కంకులతో అలంకరించారు. వేదిక ముందు వడ్లను రాసిగా పోశారు. దీక్షా స్థలంతో పాటు వేదిక మీద కూడా కుర్చీలు వేయలేదు. దీంతో మంత్రులతో సహా నేతలంతా జిల్లాలవారీగా తమకు కేటాయించిన స్థానాల్లో నేలపైనే కూర్చున్నారు. జిల్లాల వారీగా మంత్రులు తమ బృందాలతో దీక్షా వేదిక వద్ద ఫొటోలు దిగడం కనిపించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవితతో సెల్ఫీలు దిగేందుకు అకడికి వచ్చిన వారు పోటీ పడ్డారు. దీక్షా వేదికపై ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు సంఘాల ప్రతినిధి రాకేశ్ టికాయత్తో పాటు మంత్రులు, ఎంపీలు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్ కూర్చున్నారు. నల్లగొండ జిల్లా నేతలు మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్తో సహా అందరూ పోచంపల్లిలో తయారుచేసిన చేనేత షర్టులు ధరించారు. దీక్షా వేదికపై గాయకులు, తెలంగాణ వేర్హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. వచ్చిన ప్రతినిధులందరికీ అక్కడే భోజనాలు ఏర్పాటుచేశారు. మధ్యలో మజ్జిగ, మంచినీళ్లు అందజేశారు.
అంబేదర్, పూలేలకు పుష్పాంజలి
దీక్షా ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలమాల వేశారు. జ్యోతి బా ఫూలే జయంతి సందర్భంగా ఆయన ఫొటోకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
నేడు క్యాబినెట్ భేటీ
ధాన్యం కొనుగోళ్లు, రైతు సంక్షేమంపై చర్చ
ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై దృష్టి
రాష్ట్ర మంత్రి మండలి మంగళవారం సమావేశం కానున్నది. ధాన్యం కొనుగోళ్ల అంశంపై చర్చించేందుకు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం మొదలవుతుంది. యాసంగి పంట చేతికి వస్తున్న తరుణంలో ధాన్యాన్ని సేకరించాలని కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం తీరుకు నిరసనగా సీఎం కేసీఆర్ ఢిల్లీలో సోమవారం ధర్నా నిర్వహించినా మోదీ సర్కారు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులు నష్టపోకుండా ఏం చేయాలన్న అంశంపై క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నది. ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉన్నదని అధికార వర్గాలు తెలిపాయి.
ట్విట్టర్లో వడ్ల పోరు ట్రెండింగ్
టాప్లో ‘వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్’
కొన్ని గంటల్లోనే దాదాపు 1.10 లక్షల ట్వీట్లు
1.41 కోట్ల మందికి చేరిన హ్యాష్ట్యాగ్
కేంద్ర ప్రభుత్వం దేశమంతటా ఒకే రకమైన ధాన్యం కొనుగోలు విధానాన్ని అమలు చేయాలంటూ సీఎం కేసీఆర్ మొదలు పెట్టిన ఉద్యమం నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ‘వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్మెంట్’ హ్యాష్ట్యాగ్ సోమవారం ఆన్లైన్లో హల్చల్ చేసింది. ట్విట్టర్లో దేశంలోనే టాప్ ట్రెండింగ్లో నిలిచింది. సోమవారం సాయంత్రానికి ఈ హ్యాష్ట్యాగ్పై 1.10 లక్షలకుపైగా ట్వీట్లు వచ్చాయి. దీంతో కొన్ని గంటలపాటు ఇది దేశంలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తంగా సోమవారం నమోదైన ట్వీట్లలో ‘వన్ నేషన్..వన్ ప్రొక్యూర్మెంట్’ హ్యాష్ట్యాగ్ మూడో స్థానంలో నిలిచింది. బ్రాండ్ మెన్షన్స్ అనే హ్యాష్ట్యాగ్ ట్రాకర్ ప్రకారం ‘వన్ నేషన్..వన్ ప్రొక్యూర్మెంట్’ హ్యాష్ట్యాగ్ సోమవారం 1.38 కోట్ల మందికి చేరింది. సమారు 40 వేల మంది దీని గురించి చర్చించుకొన్నారు.