హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించబోమని ఆనాడు రామగుండంలో చెప్పిన ప్రధాని నేడు ఉద్దేశపూర్వకంగానే సంస్థను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఆర్ఎస్ లోక్సభాపక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. న్యూఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి బొగ్గు గనుల వేలాన్ని నిలిపేయాలని కోరారు. భవిష్యత్తులో సింగరేణికి బొగ్గు గనులు దకకుండా చేయడమే కేంద్రం లక్ష్యంగా కనిపిస్తున్నదని అన్నారు. కోల్ బ్లాకులు లేకుండా సింగరేణి ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.
తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని ప్రైవేటీకరించి, తెగనమ్మాలని చూడడం దారుణమని విమర్శించారు. తెలంగాణ అంటే కేంద్రానికి చిన్న చూపు అని, ఒకవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అడ్డుకుంటూ మరోవైపు మైన్స్ కూడా లేకుండా అమ్మకానికి పెట్టారని దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ సంస్థలను కేంద్రం అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు. సింగరేణిని తెలంగాణాకే వదిలేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతమేనని, దానిని కూడా తెలంగాణే తీసుకుంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోకుండా సింగరేణి బ్లాకులను ప్రైవేటీకరించడం సరైంది కాదని అన్నారు. వేల మందికి జీవనోపాధి కల్పిస్తున్న సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడం వెనుక అనుమానాలున్నాయని చెప్పారు.
సింగరేణి నుంచి దాదాపు రెండు వేలకు పైగా పరిశ్రమలకు బొగ్గు సరఫరా జరుగుతున్నదని, వేలాది మంది కార్మికులు సింగరేణిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. రాష్ర్టానికి అడుగడుగునా అన్యాయం చేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్న కేంద్రాన్ని తెలంగాణ సమాజం నహించదని చెప్పారు. తెలంగాణ వ్యతిరేక విధానాలపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీసి, దేశమంతటికీ తెలియజేస్తామని చెప్పారు. రాష్ట్రానికి చేసిన అన్యాయాలు, నిధుల నిలిపివేత, విభజన హామీల అమలులో వైఫల్యం, దివాలాకోరు రాజకీయాలు తదితర అంశాలపై పార్లమెంట్లో గర్జిస్తామని స్పష్టం చేశారు.
బీజేపీది రెండు నాలుకల ధోరణి అనేందుకు సింగరేణి ప్రైవేటీకరణ అంశమే నిదర్శనమని తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. అవినీతి రహిత పాలనను అందిస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన మోదీ.. అత్యంత విలువైన దేశ సంపదను తెగనమ్ముతున్నారని గురువారం ఓ ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు భావితరాలకు తీరని ద్రోహం చేయడమే కాకుండా మరోవైపు మత విద్వేషాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ చేస్తున్న కుట్రలను గ్రహించిన దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని కోలేటి అభిప్రాయపడ్డారు.