హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక్కమాటంటే తాము పది మాటలు అంటామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి హెచ్చరించారు. సీఎం కేసీఆర్పైనా, టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా నోటికొచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదని పేర్కొన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు బీజేపీ కుట్రలుచేస్తున్నదని ఆరోపించారు. బుధవారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, ప్రకాశ్గౌడ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ది పాదయాత్ర కాదని, అది బీజేపీ కార్యకర్తల యాత్ర అని ఎద్దేవాచేశారు. సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారని, బండి సంజయ్ యాత్రను జనం పట్టించుకోవటంలేదని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు సీఎం కేసీఆర్ కంటే అద్భుతంగా పాలిస్తున్నారా? ప్రజల కష్టసుఖాలను పట్టించుకుంటున్నారా? అనే అంశాలపై దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలని బండి సంజయ్కు సవాలు విసిరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడేండ్లలో తెలంగాణకు చేసిందేమిటని ప్రశ్నించారు. ప్రధాని మోదీ ప్రజలకు చేసిన ఒక్కమంచి పనైనా చెప్పాలని డిమాండ్ చేశారు. తాము రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేసిన మంచి పనులను వంద చూపుతామని చెప్పారు. జీవో 111పై బండి సంజయ్ అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయం కోర్టులో ఉన్నందున తాము మాట్లాడటం సమంజసం కాదన్నారు. సందర్భం వచ్చినప్పుడు ఆ జీవో పరిధిలో ఎంతమంది బీజేపీ నాయకులకు ఎన్ని వందల ఎకరాలున్నాయో వెల్లడిస్తామని అన్నారు. రాష్ట్రంలో నిజాం నవాబుల పాలన అంటూ తలాతోకలేకుండా మాట్లాడుతున్న బండి సంజయ్ ఇక్కడి ప్రజలు తమకు గుజరాత్ పటేళ్ల పాలన వద్దని ఏనాడో తేల్చిచెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు చెప్పారు. బండి సంజయ్ ఢిల్లీకి బానిసగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
ఇంకో 20 ఏండ్లు టీఆర్ఎస్దే అధికారం : ఎమ్మెల్యే కాలె యాదయ్య
బీజేపీ నేతలు ఎన్ని యాత్రలు చేసినా.. ఎన్ని ఎత్తులేసినా రాష్ట్రంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని, కేసీఆరే సీఎంగా ఉంటారని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. బండి సంజయ్ యాత్ర పావలాకు కూడా పనికి రాని యాత్ర అని కొట్టిపారేశారు. యాత్రకు ప్రజలు రాకపోవడంతో బస్సుల్లో కార్యకర్తలను తీసుకొస్తున్నారని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీపై ప్రజలకు వ్యతిరేకత ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్రెడ్డి పాదయాత్ర చేపట్టారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉన్నదని వివరించారు. ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. దళితబంధు పథకంతో దళితవర్గాలన్నీ సీఎం కేసీఆర్ను దేవుడిలా కొలుస్తున్నాయని పేర్కొన్నారు.
చరిత్ర తెలియని నాయకుడు బండి : ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
బండి సంజయ్ హైదరాబాద్ చరిత్ర తెలియకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ పేరు మారుస్తా.. గోల్కొండ పేరు మారుస్తా అంటూ ప్రజల విశ్వాసాలతో చెలగాటం ఆడుతున్నాడని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చుపెట్టి రాజకీయాలు చేయటం కాకుండా, ప్రజా విశ్వాసాన్ని పొందేందుకు బీజేపీ నేతలు ఆలోచించుకోవాలని సూచించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇతర మతాలవారి ఆస్తులు ఎన్ని అమ్మి హిందువులకు పంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఎన్నికల సందర్భంలోనే దేవుళ్లు గుర్తుకొస్తారని ఎద్దేవాచేశారు.