ఆదిలాబాద్, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు లైన్ల రహదారి నిర్మాణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షకు నిరసనగా శనివారం జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి బేల మీదుగా మహారాష్ట్రకు వెళ్లే రహదారిపై ఎమ్మెల్యే జోగు రామన్న, జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ నగేశ్, ఆదిలాబాద్, బేల, జైనథ్ మండలాల టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు, ప్రజలతో కలిసి ధర్నా నిర్వహించారు. చంద్రాపూర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా భోరజ్ వరకు 2017లో జాతీయ రహదారి 353బీని కేంద్రం మంజూరు చేసిందని, మహారాష్ట్రలోని ఉపసనాల వరకు 68 కిలోమీటర్లు 4 వరుసలు, ఆదిలాబాద్ జిల్లాలో 33 కి.మీ. రెండు లైన్ల రోడ్డును నిర్మిస్తూ కేంద్రం వివక్ష చూపుతున్నదని మండిపడ్డారు. ఒకే రోడ్డును రెండు విధాలుగా నిర్మించడం ఏంటని ప్రశ్శించారు.