చండూరు, అక్టోబర్ 16: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డికి మద్దతుగా మంత్రులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇన్చార్జులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేస్తూ గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతున్నారు. ఆదివారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం, ఖుదాభక్ష్పల్లి గ్రామాల్లో కూసుకుంట్లతో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. చండూరు మండల కేంద్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా లాండ్రీ షాపు వద్ద బట్టలు ఇస్త్రీ చేసి కారు గుర్తుకు ఓటేయాలని కోరారు. చౌటుప్పల్లో ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రచారంలో పాల్గొన్నారు. నాంపల్లి మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ మండలంలోని ఆరెగూడెం, కాట్రేవు, గుండ్లబావి గ్రామాల్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రచారం చేశారు. సంస్థాన్ నారాయణపురం మండలంలోని పుట్టపాక, జనగాం గ్రామాల్లో కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు.
అవకాశమివ్వండి.. సేవకుడిగా పనిచేస్తా: కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి
మునుగోడు ప్రజలు అవకాశమిస్తే సేవకుడిగా పనిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే లక్షణాపురం, శివన్నగూడెం ప్రాజెక్టు పనులను పూర్తిచేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ కారణంగానే మునుగోడు నియోజకవర్గం వెనుకబాటుకు గురైందని ధ్వజమెత్తారు. రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్నారు.