హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్పై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రులు భగ్గుమన్నారు. చౌహాన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే బీజేపీ పాలిత రాష్ర్టాలు, తెలంగాణలో అమలవుతున్న పథకాలు, అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఢిల్లీకి వస్తావా? నీ భోపాల్ నడిగడ్డకు రమ్మంటావా? వేదిక ఎక్కడో తేల్చుకోవాలని సవాల్ చేశారు. అభివృద్ధిలో మధ్యప్రదేశ్కు, తెలంగాణకు పోలిక ఉన్నదా? అని ప్రశ్నించారు. బీజేపీదీ అంధకార పాలనైతే టీఆర్ఎస్ది వెలుతురు యుగమని వ్యాఖ్యానించారు. శనివారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, గంగుల కమలాకర్, వీ శ్రీనివాస్గౌడ్, పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్పై శివరాజ్సింగ్ చౌహాన్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. మంత్రి తలసాని మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్కు ఉన్న దమ్మేంటో ప్రధాని మోదీని అడిగి తెలుసుకోవాలని చురకలంటించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చౌహాన్.. సీఎం కేసీఆర్పై అత్యంత బాధ్యతారాహిత్యంగా నోరు పారేసుకొన్నారని మండిపడ్డారు. టూరిస్టు బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మా ట్లాడితే సహించేదిలేదని హెచ్చరించారు. బీజేపీ నేతలు డ్రామా కంపెనీ యాక్టర్ల మాదిరిగా తయారయ్యారని విమర్శించారు. బీజేపీ చిలర్ల రాజకీయాలతో ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. బడులు, గుడులపై చర్చకు భద్రాద్రి రాములోరి దగ్గరికి వెళ్దామా? యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి దగ్గరికి పోదామా? అని సవాలు విసిరారు.
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేశానని చెప్పుకొంటున్న శివరాజ్సింగ్ చౌహాన్ రైతులకు, బీసీలకు ఏమి చేశారో చెప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ నిలదీశారు. దొడ్డదారిలో ముఖ్యమంత్రి అయిన చౌహాన్ ప్రజా ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గురించి మాట్లాడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే పంజాబ్లో మోదీకి ఎదురైన అనుభవమే ఇక్కడా తప్పదని హెచ్చరించారు. విస్తీర్ణంలో తెలంగాణ కంటే పెద్దదైన మధ్యప్రదేశ్లో పంటల దిగుబడి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో 2019 -20లో రైతుల నుంచి కేవలం 26 లక్షల టన్నుల పంటను సేకరిస్తే.. తెలంగాణలో ఒక కోటీ 40 లక్షల టన్నులు సేకరించామని వివరించారు. 2020-21లో మధ్యప్రదేశ్లో 37లక్షల టన్నులు సేకరిస్తే.. తెలంగాణలో ఒక కోటీ 41లక్షల టన్నులు సేకరించామని గుర్తుచేశారు. అనారోగ్య రాష్ర్టా ల జాబితాలో మధ్యప్రదేశ్ 3వ స్థానంలో ఎందుకు ఉన్నదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మధ్యప్రదేశ్ను బీమారు రాష్ట్రంగా, తెలంగాణను అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కీర్తించాయని గుర్తుచేశారు. టీఆర్ఎస్ తలచుకొంటే శివరాజ్సింగ్ లాంటి బీజేపీ నేతలు రాష్ట్రంలో అడుగుపెట్టేవారే కాదని, సీఎం కేసీఆర్ అనుమతిస్తే భయమంటే ఏమిటో చూపేవాళ్లమని పేర్కొన్నారు. బీజేపీ ముఖ్యమంత్రులకు, ప్రధాని నరేంద్రమోదీకి సీఎం కేసీఆర్ గురించి వింటే నిద్రపట్టడం లేదని వ్యాఖ్యానించారు. బండి సంజయ్తోపాటు అనేక మంది కేంద్ర మంత్రులకు నిద్రలేని రాత్రులను సీఎం కేసీఆర్ రుచిచూపిస్తున్నారని అన్నారు. మధ్యప్రదేశ్లో ఉపాధి లేక పొట్టచేత పట్టుకొని రాష్ర్టానికి వచ్చిన లక్షలాది వలస కూలీలను తమ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని చెప్పారు.
ప్రజలు ఎన్నుకొన్న కేసీఆర్ ప్రభుత్వానిది రహదారి అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, ముఖ్యమంత్రి అయిన శివరాజ్సింగ్ చౌహాన్ది దొడ్డదారి అని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం హోదాలో ఉండి చౌహాన్ మతిభ్రమించి మాట్లాడారని విమర్శించారు. తెలంగాణ అంటే ఏమిటో మధ్యప్రదేశ్ మాజీ సీఎం ఉమాభారతిని అడిగి తెలుసుకోవాలని చౌహాన్కు చురకలంటిచారు. తెలంగాణలో ఇతరులను గౌరవించే సంస్కృతి ఉండబట్టే బీజేపీ నేతలు గౌరవంగా తిరిగి వెళ్లగలుగుతున్నారని, టీఆర్ఎస్ సహనాన్ని పరీక్షిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగాలు, ఉద్యోగాల గురించి మాట్లాడే నైతికహక్కు బీజేపీకి లేదని, జీవో 317 ఉత్తర్వులపై కావాలనే రాద్ధాంతం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను శాశ్వతంగా ఎత్తేసేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు. ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను కనీసం గుర్తించని దుర్మార్గ పాలన బీజేపీదని మండిపడ్డారు. చౌహాన్ సీఎం కేసీఆర్కు క్షమాపణ చెప్పకపోతే, తాము మధ్యప్రదేశ్లో పర్యటించి, రెండు రాష్ర్టాల్లో జరిగిన అభివృద్ధిపై అక్కడి ప్రజలకు వివరిస్తామని చెప్పారు.