హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు.. ఢిల్లీలో జాడ లేని పత్తా. ఇదీ! టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అసలు స్వరూపం. ఢిల్లీలో బుధవారం విపక్ష పార్టీలన్నీ పార్లమెంట్ ఆవరణలో జీఎస్టీ బాదుడు, అధిక ధరలకు వ్యతిరేకంగా గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా హాజరయ్యారు. రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్లమెంటరీ నాయకుడు కే కేశవరావుతో సహా ఎంపీలంతా పాల్గొన్నారు. రాహుల్ పక్కనే కేశవరావు కూర్చొని సంఘీభావం తెలిపారు. కానీ, మోదీ సర్కారు గురించి రాష్ట్రంలో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉండి కూడా ముఖం చాటేశారని విమర్శకులు మండిపడుతున్నారు.
రేవంత్రెడ్డికి పూర్వాశ్రమంలో టీడీపీతో ఉన్న సంబంధాలో, లేక బీజేపీతో ఉన్న లోపాయికారి వ్యవహారాలో తెలియదు గానీ తన నాయకుడు రాహుల్గాంధీ స్వయంగా హాజరైన కార్యక్రమానికి కూడా డుమ్మా కొట్టారని విమర్శిస్తున్నారు. ఇంతకు ఆ సమయంలో రేవంత్రెడ్డి ఎక్కడున్నారని ఆరా తీస్తే.. సమైక్యవాదులు, తన పాత దోస్తులతో కలిసి టీడీపీ ఎంపీ కేశినేని నాని ఇంట్లో ఉన్నట్టు సమాచారం. పార్లమెంట్లో అనుసరించబోయే వ్యూహంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆ పార్టీ ఎంపీలకు చేసే దిశానిర్దేశాన్ని వినడానికి రేవంత్ వెళ్లి ఉంటారని కాంగ్రెస్ ఎంపీనే ఒకరు వ్యాఖ్యానించారు.
దీన్ని బట్టి చంద్రబాబు డైరెక్షన్లోనే ఇప్పటికీ రేవంత్రెడ్డి నడుస్తున్నారనే విమర్శలు సరైనవేనని అర్థం అవుతున్నది. మొన్న జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లోనూ క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఆరోపణలు కూడా నమ్మక తప్పడం లేదు. ఎమ్మెల్యే సీతక్క పొరపాటుగా పెన్తో మార్క్ పడిందని చెప్తున్నా, చంద్రబాబు నుంచి వచ్చిన ఆదేశాలతోనే, రేవంత్ సూచనతోనే ఇలా చేసి ఉండవచ్చనే అనుమానాలకు బలం చేకూరినట్టు అవుతున్నది. ఎంతైనా రాహుల్ గాంధీ కంటే రేవంత్రెడ్డికి తన బాస్ చంద్రబాబు మాటే వేదం కదా! అని పలువురు ఎద్దేవా చేస్తున్నారు.