కోరుట్ల నెట్వర్క్, జనవరి 18: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు నిరసన సెగ తగిలింది. పసుపు బోర్డు తెస్తానని, వంద రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తానని ఎన్నికల ముందు హామీలు ఇచ్చి నెరవేర్చకపోవడంపై రైతులు, టీఆర్ఎస్ నాయకుల్లో ఆగ్రహం పెల్లుబికింది. మంగళవారం జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో పర్యటనకు వచ్చిన ఆయన్ను మెట్పల్లి మండలం వేంపేట క్రాసింగ్ వద్ద అడ్డుకొన్నారు. అర్వింద్ గో బ్యాక్ అంటూ నినదించారు. టీఆర్ఎస్ నాయకులు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని ఎంపీ, గ్రామాల్లో పర్యటించవద్దంటూ ఆయన కాన్వాయ్ని అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకొన్నారు. కోరుట్ల కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌక్ వద్ద ఎంపీ అర్వింద్ దిష్టిబొమ్మను దహనం చేశారు. కోరుట్ల మండలంలోని అన్ని గ్రామాల్లోనూ ఆయన దిష్టిబొమ్మలను టీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఇప్పటికైనా ఎంపీ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణ చెప్పి పర్యటనకు రావాలని, లేదంటే ఎక్కడికక్కడ అడ్డుకొంటామని హెచ్చరించారు.