హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ లికర్ కేసుకు, మహిళా రిజర్వేషన్ల అంశానికి పొంతనేలేదని, రెండింటినీ ఒకే గాటనకట్టడం తగదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విపక్షాలకు హితవు పలికారు. వేర్వేరు అంశాలైన వీటిని రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు బండి సంజయ్, డీకే అరుణ, కాంగ్రెస్ నాయకులు రేవంత్రెడ్డి, భట్టి విక్రమారల తీరు విస్మయం కలిగిస్తున్నదని ధ్వజమెత్తారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లను సాధించేందుకే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో దీక్ష చేపట్టారని, ఈ నెల 13 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీపై ఒత్తిడి పెంచడమే ఈ దీక్ష లక్ష్యమని తెలిపారు.
మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలోనే 2014 జూన్ 14న అసెంబ్లీలో తీర్మానం చేసిన విషయాన్ని అందరూ గుర్తుచేసుకోవాలని వినోద్కుమార్ సూచించారు. ఈ తీర్మాన ప్రతిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రధాని మోదీకి అందజేసి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని పలుమార్లు కోరారని, ఆ సమయంలో కేసీఆర్ వెంట తాను, కవితతోపాటు 16వ లోక్సభ ఎంపీలంతా ఉన్నారని వివరించారు. మహిళా రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ ఎంపీలు చాలా కాలం నుంచి పార్లమెంట్లో పోరాడుతున్నారని గుర్తుచేశారు. దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడు 1996 సెప్టెంబర్ 12న మహిళా రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారని, ఇది జరిగి 2016 సెప్టెంబర్ 12 నాటికి 20 ఏండ్లు పూర్తవడంతో మహిళా రిజర్వేషన్ల కోసం తాను కూడా పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీశానని వినోద్కుమార్ తెలిపారు.