కోహెడ, జూన్ 16 : కేంద్రం నుంచి పైసా తేవడం చేతకాని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. గురువారం సిద్దిపేట జిల్లా కోహెడ్ మండలం శ్రీరాములపల్లిలో రైతు వేదికను హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్కుమార్తో కలిసి ప్రారంభించారు. గొట్లమిట్లలో మహిళా సంఘ భవనం, వైకుంఠధామాన్ని, వరికోలులో రైతు వేదిక, ముదిరాజ్ కమ్యూనిటీ భవనం ప్రారంభించారు. తంగళ్లపల్లిలో పల్లె ప్రకృతివనం, తెలంగాణ క్రీడా మైదానం, సీసీ రోడ్లను ప్రారంభించి మనఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణలో ప్రాజెక్టులను అడ్డుకోవడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయని ధ్వజమెత్తారు. మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయక సాగర్ తదితర ప్రాజెక్టులను అడ్డుకొన్నారని ఆరోపించారు. ఇప్పుడు గౌరవెల్లి ప్రాజెక్టును అడ్డుకొంటున్నారని మండిపడ్డారు. కేంద్రం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, ఇతర ప్రాజెక్టులకు ఒక్క పైసానైనా తెచ్చావా? అని బండి సంజయ్ని ప్రశ్నించారు.