హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 పరీక్షలు ఉర్దూలో రాసేందుకు అనుమతించటంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన తెలివితక్కువ తనానికి నిదర్శనమని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ అన్నారు. ఉర్దూను భారత రాజ్యాంగం అధికార భాషల్లో ఒకటిగా గుర్తించినప్పుడు, తెలంగాణలో రెండో అధికార భాషగా గుర్తింపు ఉన్నప్పుడు పబ్లిక్ సర్వీస్ పరీక్షలను ఉర్దూలో నిర్వహించడంలో తప్పేందని ప్రశ్నించారు.
ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మహబూబ్నగర్ జిల్లా దేవరకద్రలో మగళవారం బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘గ్రూప్-1 నోటిఫికేషన్లో ఉర్దూను చేర్చటం వెనుక కుట్ర ఉన్నది. ఉర్దూలో పరీక్ష ఎవరు రాస్తరు? ఉర్దూలో రాస్తే ఎవరు దిద్దుతరు? కుహనా సెక్యులర్వాదులు బీజేపీపై మొరుగుతుంటరు. గ్రూప్-1 నోటిఫికేషన్లో ఉర్దూను చేర్చటాన్ని మీరు సమర్థిస్తరా? వ్యతిరేకిస్తరా? పరీక్షలో రీజియన్ లాంగ్వేజీ ఉండాలి.. రిలీజియన్ లాంగ్వేజీని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోం. గ్రూప్-1లో ఉర్దూకు అవకాశం ఇస్తే పెద్దపెద్ద ఉద్యోగాలన్నీ ఒక వర్గానికే వస్తాయి. హిందూ సమాజానికి సంబంధించిన ఏ వ్యక్తీ ఆఫీసర్ కాలేడు. గ్రూప్-1 నోటిఫికేషన్లో ఉర్దూను చేర్చటాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో మహా పోరాటం మొదలుపెడుతున్నాం’ అని అన్నారు. బండి వ్యాఖ్యలను వినోద్కుమార్ బుధవారం ఖండించారు. వాస్తవాలను వక్రీకరించి యువత జీవితాలను నాశనం చేయొద్దని హెచ్చరించారు.
దేశంలో అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాలైన ఐఏఎస్, ఐపీఎస్ తదితర పోస్టుల భర్తీకి నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు కూడా ఉర్దూలో ఉంటాయని వినోద్కుమార్ గుర్తుచేశారు. ‘దేశంలో 130 కోట్ల పైచిలుకు ప్రజలు ఉన్నారు. వేల భాషలు ఉన్నాయి. అత్యంత ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలు 22 భాషల్లో నిర్వహిస్తారు. అందులో ఉర్దూ కూడా ఉన్నది. ఈ మేరకు భారత రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లో స్పష్టంగా ఉన్నది. భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఉర్దూ కూడా ఒకటి. దేశ వ్యాప్తంగా 239 మిలియన్ల మంది ఉర్దూ భాష మాట్లాడుతున్నారు. సివిల్స్ ఉర్దూలో రాస్తారు కాబట్టి ఆ ఉద్యోగాలన్నీ ముస్లింలకే వస్తున్నాయా? అనేక రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు నిర్వహించే పరీక్షలు కూడా అక్కడ గుర్తింపు ఉన్న అన్ని భాషల్లో పరీక్షలు నిర్వహించాలి. ఈ మేరకు భారత రాజ్యాంగం భారత పౌరులకు హక్కులు కల్పించింది. దీనిని గుర్తించకుండా బీజేపీ నేతలు బండి సంజయ్, అర్వింద్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. యువతలో విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతను చదువుకోకుండా చేస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు ఉర్దూలో నిర్వహించారని వినోద్కుమార్ గుర్తుచేశారు. తెలంగాణలో మాత్రమే కొత్తగా ఉర్దూలో పరీక్షలు నిర్వహించటం లేదని, దేశంలోని అనేక రాష్ర్టాల్లో కూడా నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన బీజేపీ నేతలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్కు రాజ్యాంగంపై కనీసం అవగాహన లేదని వారి మాటలే స్పష్టంచేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ బాధ్యతలు స్వీకరించిన 2014 నుంచి 2022 వరకు నిర్వహించిన సివిల్స్ పరీక్షలు ఉర్దూలో కూడా నిర్వహించారని, దీనిపై బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు.