హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అసోం సీఎం హిమంత బిస్వాను గోషామహల్ టీఆర్ఎస్ నాయకుడు నందు బిలాల్ హెచ్చరించారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అసోం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక చార్మినార్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వద్దకు చేరుకున్న హిమంతా బిస్వా.. భాగ్యనగర్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించేందుకు సిద్ధమయ్యారు. ఈ సమయంలోనే గోషామహల్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నందు బిలాల్ వేదికపైకి వెళ్లి.. మైక్ను లాక్కున్నారు. కేసీఆర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మీకు మాట్లాడే అర్హత లేదని.. వేదికపైనే అసోం సీఎంను నందు బిలాల్ హెచ్చరించారు. అనంతరం పోలీసులు నందును అదుపులోకి తీసుకుని అబిడ్స్ పోలీసు స్టేషన్కు తరలించారు.
ఈ సందర్భంగా నందు బిలాల్ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. ఖబడ్దార్ అని హెచ్చరించారు. గణేశ్ ఉత్సవాలకు వచ్చిన అసోం సీఎం.. రాజకీయాలు మాట్లాడటం సమంజసం కాదన్నారు. తమ సీఎంను దూషించినందుకే ఆయనను మాట్లాడనివ్వకుండా అడ్డుక్కున్నానని తెలిపారు. హైదరాబాద్లో అసోం సీఎం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమని స్పష్టం చేశారు. ప్రశాంతంగా నిమజ్జన కార్యక్రమాన్ని జరగనివ్వాలని నందు బిలాల్ కోరారు.