పేదలకు ఇండ్లు కట్టియ్యాలని సీఎం కేసీఆర్ ఐదేండ్ల కిందనే ఈటలకు 4 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారు. రాష్ట్రమంతా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పేదలను ఇండ్లల్లకు తోలుతున్నం. హుజూరాబాద్లో నేటికి ఒక్క ఇల్లు కట్టియ్యలేదంటే రాజేందర్కు పేదలపై ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది. గెల్లు శ్రీనివాస్ను గెలిపిస్తే 5 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి పేదలను ఇండ్లలోకి పంపించే బాధ్యత నాదే.
–మంత్రి హరీశ్రావు
కమలాపూర్, అక్టోబర్ 2: రైతులకు 24 గంట ల కరెంటు, రైతుబంధు ఇచ్చిన టీఆర్ఎస్ దిక్కు ఉందామా.. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధర లు పెంచి డబ్బులు గుంజుకునే బీజేపీ వైపు ఉందా మా? ప్రజలు ఆలోచించుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచించారు. శనివారం హనుమ కొండ జిల్లా కమలాపూర్ మండలం కన్నూరులో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి ధూంధాం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈటల ఎందుకు రాజీనామా చేశారో ఇప్పటికీ చెప్పలేదన్నారు. రైతులకు రైతుబంధు, రైతుబీమా ఇచ్చి టీఆర్ఎస్ ఆదుకుంటుంటే.. బీజేపీ కొనుగోలు కేంద్రాలు ఎత్తేస్తం, వ్యవసాయ బావులకు మీటర్లు పెడ్తమంటున్నదని విమర్శించారు. బీజేపీ చేసిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తానన్న ఈటల.. అదే బీజేపీలో ఎందుకు చేరారో ప్రజలకు చెప్పాలని డిమాండ్చేశారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, అమిత్షాతో మాట్లాడి నల్లచట్టాలు రద్దు చేయిస్తానని, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పెంచుతామని, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని చెప్పి ఓట్లు అడగాలని హితవుపలికారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలకు కోత లు, వాతలు మిగల్చడంతోపాటు ప్రభుత్వ సంస్థలను అమ్మకానికి పెట్టి ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నదని హరీశ్రావు ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ పథకాలు ఉన్నాయా ఈటల చెప్పాలని నిలదీశారు. తాను రాజీనామా చేస్తే పథకాలు వచ్చాయంటున్న రాజేందర్.. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్కిట్, ఆసరా పింఛన్లు మీరు రాజీనామా చేస్తేనే వచ్చాయా చెప్పాలని డిమాండ్ చేశారు. రూపాయి బొట్టు బిల్ల ఇస్తే బాగుపడతమా?.. రెండు వేల పింఛన్తో బాగుపడతమా?, 80 రూపాయల గడియారం ఇస్తే బతుకుతమా.. ఆడపిల్ల పెండ్లికి లక్షా116 ఇస్తే బతుకుతమా ఆలోచన చేయాలని కోరారు.
ఉప ఎన్నికలో గెలిచేందుకు మాయమాటలు చెప్తూ మొసలీకన్నీళ్లు కార్చుతున్న ఈటల రాజేందర్ను నమ్మొద్దని హరీశ్రావు సూచించారు. తన బాధను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నడని, 17 ఏండ్లు ఎమ్మెల్యే, మంత్రిగా ఉండీ ఏం చేయలేదని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి ఏం చేస్తడని ప్రశ్నించారు. అభయహస్తం పథకానికి కట్టిన డబ్బులకు వడ్డీ చెల్లించి 2 వేల పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు.
ఒక్కసారి అవకాశం ఇస్తే మీ సేవకునిగా పనిచేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ ప్రజలకు విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్తో మాట్లాడి 100 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్లో మెడికల్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా కన్నూరుకు చెందిన పుల్లూరి శ్రీనివాసరావు ఎన్నికల ఖర్చు కోసం గెల్లు శ్రీనివాస్కు రూ.25 వేల విరాళం ఇచ్చారు. భీంపల్లికి చెందిన కొత్తపల్లి సారంగం రూ.వెయ్యి విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి, మండల ఇంచార్జీ డాక్టర్ పేరియాల రవీందర్రావు, సర్పంచ్ రామారావు, సింగిల్ విండో చైర్మన్ సంపత్రావు, ఎంపీటీసీ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు.