హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): ధాన్యం సేకరణపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అబద్ధాలకు అంతు లేకుండా పోతున్నది. తాను మాట్లాడేవన్నీ అబద్ధాలు, అసత్య ఆరోపణలని తెలిసీ పదేపదే అవే వల్లె వేస్తున్నారు. మొదటి నుంచీ రాష్ట్ర ప్రభుత్వంపై బట్ట కాల్చి మీదేసే వైఖరి అవలంబిస్తున్నారు. ఆయన అబద్ధాలు మచ్చుకు నాలుగైదు..
1.అప్పటి మాట: రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నది. అసలు రైతులకు రా రైస్, బాయిల్డ్ రైస్తో ఏం సంబంధం? రైతు పండించేది వడ్లు మాత్రమే. బాయిల్డ్ రైస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ధాన్యం కొనుగోలు నుంచి తప్పించుకోవాలని సూస్తున్నది.
ఇప్పటి మాట: ధాన్యం సేకరించబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదు. బాయిల్డ్ రైస్ కాకుండా రా రైస్ మాత్రమే తీసుకొంటామని చెప్పింది. రాష్ట్రంలోని రా రైస్ మొత్తం కేంద్రమే సేకరిస్తది.
వాస్తవం: రైతులు పండించేది వడ్లు మాత్రమే అయినప్పుడు రా రైస్, బాయిల్డ్రైస్ ఎక్కడి నుంచి వచ్చాయో బండి సంజయ్ చెప్పాలి. రైతులు ధాన్యం మాత్రమే పండిస్తారు కాబట్టి.. కేంద్రం కూడా ధాన్యమే కొనుగోలు చేయాలి. అలా కాకుండా రా రైస్ మాత్రమే తీసుకొంటామని ఎలా చెప్తున్నది? బండి సంజయ్ కూడా రా రైస్ మొత్తం కేంద్రం సేకరిస్తుందని ఎలా చెప్తారు?
2.అప్పటి మాట: రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల లో మిల్లర్లతో కుమ్మక్కై కుంభకోణానికి పాల్పడుతున్నది. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఎఫ్సీఐకి ఇస్తున్నది.
ఇప్పటి మాట: రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన బియ్యమే ఇంకా ఇవ్వడం లేదు. ఇవ్వాల్సిన స్థాయిలో బాయిల్డ్ రైస్, రా రైస్ను ఇవ్వడం లేదు.
వాస్తవం: మన వద్ద పంపిణీ చేసే రేషన్ బియ్యం రా రైస్ కిందకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్సీఐకి యాసంగిలో బాయిల్డ్ రైస్ను, వానకాలంలో రా రైస్ను ఇస్తున్నది. వానకాలంలో రా రైస్ ఉత్పత్తికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. యాసంగిలో బాయిల్డ్ రైస్ వస్తుంది కాబట్టి రా రైస్ ఇవ్వాలంటేనే ఇబ్బంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేసి ఇస్తున్నట్టయితే యాసంగిలో రా రైస్ ఇవ్వలేం.. బాయిల్డ్ మాత్రమే ఇవ్వగలం అని ఎందుకు పట్టుబడుతుంది? ఎఫ్సీఐ గతేడాది నుంచే బియ్యం నాణ్యత పరీక్షలను మరింత కఠినం చేసింది. బియ్యం గింజ వయసు, రంగును గుర్తించేలా ప్రత్యేక మిశ్రమ సూచిక పద్ధతిని ప్రవేశపెట్టింది. రేషన్ బియ్యం రీ సైక్లింగ్ చేస్తే సులువుగా గుర్తిస్తారు. దీన్నిబట్టి బండి ఆరోపణలు పచ్చి అబద్ధమనేది సుష్పష్టం.
3. అప్పటి మాట: రాష్ట్రంలో ధాన్యం దిగుబడిపై దొంగ లెక్కలు చెప్తున్నారు. ఇతర రాష్ర్టాల నుంచి ధాన్యం తెచ్చి ఇక్కడ లెక్కల్లో చూపుతున్నారు.
వాస్తవం: బండి సంజయ్ గతేడాది స్వయంగా కల్లాల వద్దకు వెళ్లి.. ‘కల్లాల్లో గుట్టలు గుట్టలుగా వడ్లు ఉన్నాయి. ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయాలి’ అని డిమాండ్ చేశారు. ఆయన రాజకీయాన్ని గమనించిన రైతులు తన్ని తరిమేశారు. రాష్ట్రంలో వడ్లే పండనప్పుడు ఆయన వెళ్లింది బీజేపీ పాలిత రాష్ర్టానికా? వరి సాగు, దిగుబడిపై కేంద్ర ప్రభుత్వం, ఎఫ్ఐసీ సొంతంగా ఎప్పటికప్పుడ పక్కా లెక్కలు సేకరిస్తాయి. మిల్లుల్లో నిల్వలపై కూడా ఎఫ్సీఐ ప్రత్యక్ష తనిఖీలు చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో దొంగ లెక్కలు వేయడం ఎలా సాధ్యం? అంటే ఆయనవన్నీ అబద్ధాలే కదా?