మారేడ్పల్లి, జూలై 9: దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని తెలంగాణ వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. సికింద్రాబాద్ క్లాక్టవర్ ప్రాంతంలోని నవకేతన్ కాంప్లెక్స్లో శనివారం ఏర్పాటు చేసిన మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) కార్యాలయాన్ని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మాదిగలు ముందుండాలని, పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. వ్యాపార, వాణిజ్యరంగాల్లోనూ మాదిగలు వృద్ధి చెందాలని అన్నారు. దళితులు ఆర్థికంగా మరింత నిలదొక్కుకొనేందుకు మాదిగ ఇండస్ట్రియల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (మిక్కీ) కృషి చేయాలని సంస్థ ప్రతినిధులకు సూచించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులకు ఎన్నో సంక్షేమ పథకాలు, సబ్సిడీ రుణాలు అందిస్తున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల టెండర్లలో దళితులకు రిజర్వేషన్ కల్పించిందని, ఇటీవల వైన్స్ షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్ అందించిందని గుర్తు చేశారు. త్వరలో మెడికల్ షాపు టెండర్లలోనూ ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నదని చెప్పారు. మిక్కీ ఫౌండర్ మహేశ్ గోగర్ల మాట్లాడుతూ.. మాదిగల వ్యాపారాభివృద్ధికి, పారిశ్రామిక వేత్తలుగా ఎదిగేందుకు మిక్కీ పని చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో మిక్కీ రాష్ట్ర అధ్యక్షుడు సంచు రాజ్కుమార్, ప్రధాన కార్యదర్శి బక్క నర్సింహా, కమిటీ సభ్యులు ఆనంద్, సుధాకర్, విప్లవ్ గాంధీ, మహిళ నాయకులు సునీత, సాయి ప్రభ తదితరులు పాల్గొన్నారు.