ఫలిస్తున్న లాక్డౌన్ నిబంధనలు
వ్యాక్సినేషన్ కూడా మరో కారణం
ప్రజలు సహకరిస్తే మరికొద్ది రోజుల్లోనే తీవ్రత తగ్గుతుందంటున్న వైద్యాధికారులు
స్టేషన్ఘన్పూర్, మే 25: మునుపెన్నడూ లేనివిధంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డుస్థాయిలో తగ్గా యి. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతుండగా, దీన్ని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. ఈ లాక్డౌన్ వల్ల మండలంలో కరోనా కేసు లు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఓపక్క పోలీసు లు నిబంధనలను కఠినంగా అమలు చేస్తుండడం.. మరోపక్క ప్రభుత్వ దవాఖానల్లో కరోనా పరీక్షలు చేస్తూ బాధితులకు చికిత్స అందిస్తున్నారు. దీనికితోడు గ్రామా ల్లో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా జ్వరసర్వే చేసి.. లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ మందులు అందించారు. అంతేకాకుండా పీహెచ్సీలో కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. అలాగే, పంచాయతీలు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలతో మండలంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లు తెలుస్తున్నది. నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మంగళవారం 50 మందికి కరోనా పరీక్షలు చేయగా, కేవలం ఐదుగురికి మాత్రమే పాజిటివ్ రావడం ఇందుకు నిదర్శనమని వైద్యాధికారి డాక్టర్ శ్రీవాణి తెలిపారు. మూడు రోజులుగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా వరకు తగినట్లు వెల్లడించారు. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ, అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రాకుండా ఉంటే మరికొద్ది రోజుల్లోనే మండలంలో కరోనా వైరస్ను పూర్తిస్థాయిలో తరిమికొట్టొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.
కొనసాగుతున్న కరోనా పరీక్షలు
రఘునాథపల్లి/కొడకండ్ల: రఘునాథపల్లి పీహెచ్సీలో మంగళవారం 26 మందికి కరోనా పరీక్షలు చేసిన్నట్లు మండల వైద్యాధికారి స్రవంతి తెలిపారు. ఇందు లో ఇద్దరికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని కోరారు. కొడకండ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 75 మందికి పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి భాస్కర్ తెలిపారు. ఇందులో 13 మందికి పాజిటివ్ రాగా, మందులు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచించినట్లు వెల్లడించారు.
దేవరుప్పులలో తగ్గుముఖం
దేవరుప్పుల: మండలంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. కఠినంగా లాక్డౌన్ నిబంధనల అమలుతోపాటు ప్రజల్లో అవగాహన పెరుగడం, వైరస్ సోకితే ఎదుర్కొనే పద్ధతులు తెలియడంతో కరోనా కేసులు తగ్గుతున్నాయి. మంగళవారం 53 మందికి పరీక్షలు చేయగా, కేవలం ముగ్గురికే పాజిటివ్ రావడం గమనార్హం. మండలంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, మరోవైపు వాక్సినేషన్ ప్రారంభం కావడంపై ప్రజలు భరోసాతో ఉన్నారు.