రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్
మంచుకొండ పీహెచ్సీ సందర్శన
వైద్యాధికారి గైర్హాజరుపై మంత్రి ఆగ్రహం
చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశం
రఘునాథపాలెం, మే 19: ఉమ్మడి జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిత్యం వంద కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ వైద్యాధికారిని ఆదేశించారు. బుధవారం మంత్రి నగరంతోపాటు రఘునాథపాలెం మండలంలోని వీ వెంకటాయపాలెం, మంచుకొండ గ్రామాల్లో పర్యటించారు. మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారి గైర్హాజరు కావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ రోజూ వంద కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆకస్మిక సందర్శించారు. అక్కడి వైద్యాధికారి గైర్హాజరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి ఫోన్ చేశారు. సకాలంలో విధులకు హాజరు కాని వైద్యాధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక కొవిడ్ నిర్ధారణ పరీక్షలకు వచ్చిన ప్రజలకు సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపైనా మండిపడ్డారు. పీహెచ్సీ ప్రాంగణానికి అధిక సంఖ్యలో ప్రజలు వచ్చి కొవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారని అన్నారు.
పరీక్షలు నిర్వహించడంలో అలసత్వం వహిస్తున్న వైద్య సిబ్బందిపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టుల కోసం వచ్చిన వారికి వెంటనే పరీక్షలు చేసి పంపాలన్నారు. ప్రాంగణంలో ప్రజలు వేచి ఉండేందుకు అవసరమైన నీడ, తాగునీరు వంటి వసతులు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని కొవిడ్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్న ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్నీ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి ప్రతిరోజూ తప్పనిసరిగా పర్యవేక్షించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో మాజీ సర్పంచ్ భుక్యా లక్ష్మణ్నాయక్ షామియానా ఏర్పాటు చేశారు. కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, రైతుబంధు జిల్లా సమితి సభ్యుడు మందడపు సుధాకర్, లక్ష్మణ్ నాయక్, పీహెచ్సీ సిబ్బంది, హెల్త్ సూపర్వైజర్ ప్రాన్సిసమ్మ, హెచ్ఈవో శ్రీనివాసరావు, సత్యనారాయణ, ఆరోగ్యమిత్ర ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.