రేపటినుంచి జెండా పండుగ
పార్టీ శ్రేణులకు మంత్రులు, ఎమ్మెల్యేల దిశానిర్దేశం
నమస్తే తెలంగాణ నెట్వర్క్: ఊరూరా గులాబీ జెండా ఎగురాలని మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. గురువారం నుంచి నిర్వహించే జెండా పండుగలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. సెప్టెంబర్ 2 నుంచి నిర్వహించే టీఆర్ఎస్ జెండా పండుగను పురస్కరించుకొని మంగళవారం ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు. మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో బీజేపీ నాయకులు 100 మంది మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ జెండా పండుగ సందర్భంగా ప్రతి వార్డులో గులాబీ జెండా రెపరెపలాడాలన్నారు. 3వ తేదీ నుంచే గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి, కట్టంగూరు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశంలో నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు, చిట్యాలలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సన్నాహక సమావేశం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్రావు ఆధ్వర్యంలో పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.కొడంగల్ నియోజకవర్గంలో గ్రామగ్రామాన పార్టీ జెండావిష్కరణ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. గ్రేటర్ హైదరాబాద్తోపాటు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల్లో జెండా పండుగ నిర్వహణకు నేతలు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. జెండా పండుగ తర్వాత వెంటనే పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించించనున్నారు.
జెండా పండుగను సక్సెస్ చేయాలి
కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. జెండా పండుగను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి 100 సీట్లతో అధికారమే లక్ష్యంగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కష్టపడాలని సూచించారు.
గులాబీ గుబాళించాలి: కొప్పుల
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ముఖ్య నాయకులతో సమీక్ష సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వ ర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడు తూ.. ఊరూ వాడలో గులాబీ జెండా ఎగురవే యాలని పిలుపునిచ్చారు. జెండా పండుగలో భాగంగా టీఆర్ఎస్ స్థానిక కమిటీలు వేయాలని సూచించారు.