బీసీల్లో ఎలా చేశారో.. ఎస్సీల్లోనూ చేయాలె
ఎనిమిదేండ్లుగా కేంద్రం దగ్గరే మా తీర్మానం
లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన.. వాకౌట్
హైదరాబాద్, మార్చి 31 : ఎనిమిదేండ్లుగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వస్తున్న ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు.. పార్లమెంట్ ఉభయసభల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో వాయిదాతీర్మానం ఇచ్చారు. తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో సమావేశాలను స్తంభింపజేశారు. తెలంగాణ ఏర్పడ్డ వెంటనే రాష్ట్రప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను వివరిస్తూ అసెంబ్లీలో తీర్మానంచేసి పంపించినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదని ఎంపీలు ఆరోపించారు.
స్పీకర్ పట్టించుకోకపోవడంతో లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు సభ నుంచి వాకౌట్చేశారు. అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ప్లకార్డులు పట్టుకొని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణభవన్లో ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వంతో దళితజాతి తీవ్రంగా నష్టపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యంగా తెలంగాణలో మాదిగలు, ఇతర ఉప కులాల పరిస్థితి దారుణంగా ఉన్నదని చెప్పారు.
మాట్లాడనివ్వలేదు: నామా నాగేశ్వరరావు
ఎస్సీ కులాల వర్గీకరణపై తాము వాయిదా తీర్మానం ఇచ్చినా తిరస్కరించారని లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వరరావు చెప్పారు. కనీసం అయిదు నిమిషాలు కూడా టైం ఇవ్వలేదని ఆవేదన చెందారు. తెలంగాణ ప్రభుత్వం 2014 నవంబర్లో శాసనసభలో తీర్మానంచేసి కేంద్రానికి పంపించిందని గుర్తుచేశారు. 2014 ఎన్నికలపుడు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వర్గీకరణ పూర్తిచేస్తామన్నారని, అద్వానీ, గడ్కరీ.. గత ప్రభుత్వాలను వర్గీకరణ చేపట్టాలంటూ లేఖలు రాశారని గుర్తుచేశారు. రాష్ట్రాలపై పెత్తనం చేస్తూ కేంద్రం పనిచేయడం లేదన్నారు. నాగర్కర్నూల్ ఎంపీ పీ రాములు మాట్లాడుతూ షెడ్యూల్డ్ కులాల్లో అసమానతలను తొలిగించాలంటే వర్గీకరణ అవసరమన్నారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరును ఎండగట్టారు. నిన్న మొన్న కాంగ్రెస్లోకి వచ్చిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్తున్నారని ఎంపీ రంజిత్రెడ్డి ఎద్దేవాచేశారు. టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంటులో ఆందోళనచేస్తుంటే కాంగ్రెస్ ఎందుకు కలిసి రావడంలేదని ప్రశ్నించారు.
బీసీల్లో మాదిరిగానే చేయాలి: టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు
ఎస్సీ వర్గీకరణపై తన విధానమేంటో చెప్పాలని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే.కేశవరావు కేంద్రాన్ని డిమాండ్చేశారు. బీసీలను ఏ విధంగా అయితే ఏబీసీడీ అని విభజించారో.. ఎస్సీలనూ వర్గీకరించాలన్నారు. ఇందుకోసం ఉషామెహ్రా, రామచంద్ర రాజు కమిషన్ల నివేదికలను పరిశీలించవచ్చని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ఏదడిగినా ఓకే అంటారే తప్ప చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ప్రస్తుత కేంద్రమంత్రి కిన్రెడ్డి అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నారని, ఈ వ్యవహారంలో కిషన్రెడ్డి చొరవ తీసుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి డిమాండ్చేశారు.