వరంగల్, జూలై 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కృష్ణా, గోదావరి నదీ జలాలపై బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ దుర్మార్గానికి నిదర్శనమని మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల అభివృద్ధికి గొడ్డలిపెట్టు లాంటిదని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే కుట్రలో భాగంగానే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చిందని దుయ్యబట్టారు. మంగళవారం ఆయన హన్మకొండలో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ వ్యవసాయరంగ ప్రగతికి నిరోధకంగా ఉన్న గెజిట్ నోటిఫికేషన్ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సుప్రీంకోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వివిధ రంగాల్లో తెలంగాణ సాధిస్తున్న అభివృద్ధిని ఓర్వలేని కేంద్రం గెజిట్ పేరుతో అడ్డుకుంటున్నదని విమర్శించారు.
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రాసిన లేఖను సాకుగా తీసుకొని, కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ర్టాల్లోని 107 ప్రాజెక్టులపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నదని, అదే జరిగితే మన పొలాలకు నీళ్లు పారే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రెండు రాష్ర్టాల రైతాంగానికి నష్టకరమని చెప్పారు. ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపకుండా, హడావిడిగా బోర్డుల పరిధిని నిర్ణయించడం రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. వివాదాలు లేని గోదావరి నదీ జలాలపైనా బోర్డు పరిధిని ఖరారు చేయడం వింతగా ఉన్నదని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులను మాత్రమే బోర్డు పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం కృష్ణానదిపై మహారాష్ట్ర, కర్ణాటకలో వివాదాలున్నా వాటిని బోర్డు పరిధిలోకి తీసుకురాలేదని గుర్తుచేశారు.
కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ను బీజేపీ స్వాగతించడం సిగ్గుచేటని కడియం దుయ్యబట్టా రు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ హక్కుల విషయంలో స్పష్టమైన వైఖరిలేదని విమర్శించారు. ఆ రెండు పార్టీల ద్వంద్వ వైఖరి, తెరచాటు విధానాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, విద్యుత్తు ఉత్పత్తి, నీటి విడుదల వంటివి కేంద్రం చేతిలో ఉంటే తెలంగాణకు, రైతాంగానికి లబ్ధి చేకూరుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రం చేతిలోకి పోతే రెండు పంటలకు నీరు వస్తుందా? అని బీజేపీ నేతలను నిలదీశారు.