చౌటుప్పల్ : మునుగోడు నియోజకవర్గానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని భువనగిరి ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, ఆందోల్ ఎమ్మెల్యే కిరణ్ ఓటర్లను కోరారు. మంగళవారం చౌటుప్పల్ మండలంలోని జైకేసారం గ్రామంలో భువనగిరి శాసనసభ్యులు శేఖర్ రెడ్డి సీపీఎం, సీపీఐ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతుందని వివరించారు. పేదల అభివృద్ధికి కట్టుబడి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. అధికారంలో లేని వ్యక్తులకు ఓటేస్తే అభివృద్ధి జరుగదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటువేస్తే అభివృద్ధి మరింత త్వరితగతిన జరుగుతుందని వెల్లడించారు. చౌటుప్పల్ మండలంలోని ఎస్ లింగోటం గ్రామంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సీపీఐ, సీపీఎం కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభాకర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
కూసుకుంట్ల కుటుంబ సభ్యుల ప్రచారం
టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇవాళ మండలంలోని పుల్లెంల గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ప్రభాకర్రెడ్డి సతీమణి అరుణ ,కోడలు ప్రతి గడప గడపకు వెళ్లి మహిళ ఓటర్లకు బొట్టుపెట్టారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరిస్తు కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వారి వెంట టీఆర్ఎస్ నాయకులు ,కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.