హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరో ఇరవై ఏండ్ల వరకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తంచేశారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో కంటే ఏ రాష్ట్రంలో ఎక్కువగా అమలవుతున్నాయో చెప్పాలని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. బీజేపీ నీటి బుడగలాంటి పార్టీ అని ఎద్దేవా చేశారు. తెలంగాణకు ఏమీ చెయ్యని, ఏమీ ఇయ్యని బీజేపీ నేతలు టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ గురించి ఇష్టారీతిన మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మండిపడ్డారు. ఆదివారం తెలంగాణభవన్లో హైదరాబాద్ టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. హైదరాబాద్ టీఆర్ఎస్ అడ్డా అని పేర్కొన్నారు. మరోసారి నగరంలోని అన్ని సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి వివిధ పదవులతోపాటు తగిన గౌరవాన్ని కల్పిస్తున్నదని అన్నారు.
బీఆర్ఎస్ అంటే బీజేపీకి భయం
టీఆర్ఎస్ను జాతీయ పార్టీ (బీఆర్ఎస్)గా ప్రకటించడంతో బీజేపీలో భయం, వణుకు మొదలైందని, దాంతో అనేక రకాల కుయుక్తులు పన్నుతున్నారని మంత్రి తలసాని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నాం కదా అని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తన ఆధీనంలోని సంస్థలతో భయాందోళనలకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ధ్వజమెత్తారు. తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టే రోజు దగ్గరలోనే ఉన్నదని హెచ్చరించారు. ‘మేం ఏమి చేశామో ప్రజలకు చెప్పగలమని, మీరేం చేశారో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉన్నదా?’ అని ప్రశ్నించారు. గుజరాత్ మాడల్ గురించి ఊదరగొట్టే బీజేపీ నేతలు.. అక్కడి ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ 100 సార్లు ఎందుకు పోవాల్సి వస్తున్నదని, ఢిల్లీలో ఉండి ఒక్క పిలుపుతో ఎందుకు గెలిపించుకోలేకపోతున్నారని తలసాని ప్రశ్నించారు.
గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్: మహమూద్ అలీ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్తు, సాగు, తాగునీటి సమస్యలు ఏ విధంగా ఉండేవో ఒక్కసారి గుర్తుచేసుకోవాలని మంత్రి మహమూ ద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని విద్యుత్తు, సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించారని తెలిపారు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని చెప్పారు. బీజేపీ తెలంగాణ ద్రోహ పార్టీ అని ధ్వజమెత్తారు. గుజరాత్ మాడల్ ఫెయిల్యూర్ అని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యంతో అన్ని వస్తువుల ధరలు పెరిగాయని విమర్శించారు.
మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. ప్రతి నియోజకవర్గంలో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సమావేశంలో ఎమ్మెల్సీలు ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, సాయన్న, పార్టీ ప్రధాన కార్యదర్శులు ఎం శ్రీనివాస్రెడ్డి, బండి రమేశ్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్యాదవ్, కార్పొరేషన్ల చైర్మన్లు రావుల శ్రీధర్రెడ్డి, గజ్జెల నగేశ్, కే విప్లవ్కుమార్, నాయకులు దాసోజు శ్రవణ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న పాల్గొన్నారు