హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి వచ్చింది. ఎలక్ర్టానిక్ వాహన రంగంలో రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ట్రైటాన్ ఈవీ ముందుకు వచ్చింది. జహీరాబాద్ నిమ్జ్లో యూనిట్ ఏర్పాటు చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ యూనిట్ ఏర్పాటైతే 25 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నారు. తొలి ఐదేళ్లలో 50 వేల వాహనాలు ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైటాన్ ఈవీ సంస్థకు రాష్ర్ట పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ పెట్టుబడితో దేశంలోనే ఎలక్ట్రిక్ వాహన రంగ తయారీకి తెలంగాణ కేంద్రంగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో ట్రైటాన్ ఈవీ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇవాళ ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్ను ట్రైటాన్ ఈవీ ప్రతినిధులు కలిసి తమ పెట్టుబడి ప్రణాళికను వివరించారు. భవిష్యత్తులో భారీగా డిమాండ్ ఉండే ఈవీ రంగంలో పెద్ద ఎత్తున విస్తరించేందుకు తమ కంపెనీ ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నదని మంత్రి కేటీఆర్కు కంపెనీ సీఈఓ హిమాన్షు పటేల్ తెలిపారు. తమ కంపెనీ భారతదేశంలో తయారీ ప్లాంట్ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న అవకాశాలను పరిశీలించిన తర్వాత తెలంగాణ కేంద్రంగా తమ కార్యకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అడ్వాంటేజ్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ రూ. 2100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ మేరకు జహీరాబాద్ నిమ్జ్లో తయారీ యూనిట్ను ఏర్పాటు చేసేందుకు సుముఖంగా ఉన్నామని హిమాన్షు పటేల్ స్పష్టం చేశారు.
తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన ట్రైటాన్ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రైవేట్ లిమిటెడ్కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ద్వారా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాలను ఈ రాష్ర్టంలో ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుందని, కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ర్టిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. కంపెనీ ప్రతిపాదిస్తున్న సుమారు రూ. 2100 కోట్ల భారీ పెట్టుబడితో 25 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన తెలంగాణ ఈవీ పాలసీ దేశంలోనే ఒక అత్యుత్తమ పాలసీ అన్నారు. టీఎస్ ఐపాస్లో మెగా ప్రాజెక్ట్కు లభించే అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఒక అత్యంత ఆకర్షణీయ ప్రాంతంగా మారుతుందన్న ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ మరియు కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందం పాల్గొంది.