సూర్యాపేట : గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని విద్యుత్ శాఖ మంత్రి, సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy) అన్నారు. సూర్యాపేటలో మంత్రికి మద్దతుగా తండాలకు తండాలు ఏకగ్రీవమవుతున్నాయి. తాజాగా సూర్యాపేట రూరల్ మండలం రేఖ్యానాయక్ తండా వాసులు మా భ్రతుకులను బాగు చేసిన మంత్రితోనే మా పయనం అంటూ ఏకగ్రవంగా తీర్మానించారు.
గ్రామస్తుల కోరిక మేరకు తండాకు వెళ్లిన మంత్రికి తండావాసులు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్, బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూసాయి తప్పా, వారి బాగోగులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు ఆత్మగౌరవాన్ని కల్పించి వారి గోస తీర్చారన్నారు. గిరిజన గ్రామాల్లో స్వయం పాలనను అందించిన గొప్ప మనసున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గిరిజన తండాల్లో రోడ్లు, మంచి నీటి వసతులను కల్పించడంతోపాటు పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మించామన్నారు. బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అన్నారు. తనను తండాకు పిలిచి ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన తండా వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.