హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): గిరిజన విద్యకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు ప్రైవేటుకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నట్టు చెప్పారు. గిరిజన గురుకులాల్లో చదివి ఐఐటీ, ఎన్ఐటీ, నీట్, ట్రిపుల్ ఐటీ వంటి విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన 43 మంది విద్యార్థులకు గురువారం సచివాలయంలో ల్యాప్ టాప్లు, రూ.50వేల నగదు ప్రోత్సాహకాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో 91 గిరిజన గురుకులాలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు కొత్తగా మరో 93 ఏర్పాటు చేసినట్టు చెప్పారు. త్వరలోనే మరో రెండు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 22 ప్రతిభా కళాశాలు, 2 పీవీటీజీ కళాశాలలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు 1200 మందికి పైగా గిరిజన విద్యార్థులు ప్రతిష్టాత్మక కళాశాలల్లో ప్రవేశం పొందినట్టు చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్, డిప్యూటీ సెక్రటరీ చంద్రశేఖర్, ఓఎస్డీలు స్వర్ణలత, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.