పాలకుర్తి : గిరిజనుల చరిత్ర ఎంతో గొప్పదని, చరిత్రను, సంప్రదాయాలను కాపాడుకోవల్సిన బాధ్యత వారిపై ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం బంజారా ఉద్యోగుల రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. నీతి, నిజాయితీగా ఉండే గిరిజనులకు ప్రభుత్వం అండగా ఉంటుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణాన్ని చేపట్టాలని అందుకు అవసరమైన సహకారం అందిస్తానని వెల్లడించారు.
పాలకుర్తి లో గిరిజనుల పిల్లల కోసం హాస్టల్ కట్టిస్తానని తెలిపారు.సేవాలాల్ జయంతిని పెద్ద ఎత్తున నిర్వహించుకోవాలని సూచించారు. భాగవతం రాసిన బమ్మెర పోతన, రామాయణం రాసిన వాల్మీకి, మొదటి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడు ఉన్న పాలకుర్తి చరిత్రను ప్రపంచానికి తెలియచేయాలని సూచించారు.
పోతనా విగ్రహం ఆవిష్కరణ..
నియోజకవర్గంలోని బమ్మెర గ్రామంలో బమ్మెర పోతనా విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు , ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆవిష్కరించారు. బమ్మెర క్షేత్రం పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కానుందని మంత్రి తెలిపారు పోతన కీర్తిని పదిమందికి తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.