హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ)/రవీంద్రభారతి: గిరిజనాభ్యుదయానికి చేయూతనిచ్చింది ముఖ్యమంత్రి కేసీఆరేనని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతిరాథోడ్ ప్రశంసించారు. పోడు భూములకు పట్టాలు, జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతం వరకు పెంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. కేసీఆర్ పాలనలో గిరిజనులకు స్వర్ణయుగం వచ్చిందని, గిరిజన సమాజం ఆయనకు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన గిరిజన దినోత్సవంలో మంత్రి సత్యవతి మాట్లాడారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సీఎం కేసీఆర్ గిరిజన పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. గిరిజన తండాలు, గోండుగూడేలను పంచాయతీలుగా మార్చి, ప్రతి జీపీలో పంచాయతీ భవనానికి రూ.20 లక్షలు మంజూరు చేశారని పేర్కొన్నారు. తండాలకు బీటీ, సీసీ రోడ్లు వేశారని, గిరిజనుల వికాసానికి ఐటీడీఏల ద్వారా వేల కోట్లు వెచ్చిస్తున్నారని వివరించారు. పోడు పట్టాలను జూన్ 24 నుంచి పంపిణీ చేస్తామని చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్ కోరుకున్న దీక్ష ఫలిస్తుందని, మూడో సారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఎన్నికవుతారని ఎరుకల నాంచారమ్మ సోది చెప్పారు. ఈ సందర్భంగా గిరిజన నిరుద్యోగ యువతకు డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం కింద 30 కార్లను మంత్రి సత్యవతి అందజేశారు.
ఎరుకల సాధికరత పథకాన్ని ప్రారంభించారు. అంతకుముందు గిరిజన నృత్యాలు, విల్లంబులు, చేతివృత్తుల వస్తు ప్రదర్శనలు, గుస్సాడి, లంబాడి నృత్యాలు అందరినీ ఆకుట్టుకున్నాయి. కార్యక్రమంలో ట్రై కార్ చైర్మన్ రామచంద్రు నాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తు, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్,తదితరులు పాల్గొన్నారు.