కొండాపూర్,డిసెంబర్21 : దేశ రక్షణకు యుద్ధ ట్యాంకర్లు(Battle tankers) తయారు చేసే కర్మాగారం సంగారెడ్డి(Sangareddy) జిల్లాకే తలమానికం అని, సైనికులు ఎత్తు, పల్లపు ప్రాంతాలతో పాటు సముద్రాల్లో సైతం శత్రుసేనలను ఎదుర్కొనే ట్యాంకులను తయారు చేశామని ఓడిఎఫ్ జనరల్ మేనేజర్ రత్న ప్రసాద్, జేజీఎం సర్జిత్రెడ్డి అన్నారు. గురువారం కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో రెండు యుద్ద ట్యాంక్లను ట్రయల్ రన్ చేశారు. ఓడిఎఫ్ పరిశ్రమ జనరల్ మేనేజర్ అధ్వర్యంలో కార్మికులు, ప్రత్యేక పోలీసు బలగాలు మల్కాపూర్కు తరలి వచ్చి నీటిలో ట్యాంకర్లను పరీక్షించారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ.. దేశ రక్షణకు స్వదేశి సాంకేతిక పరిజ్ఞానంతో ఓడిఎఫ్లో రూపొందించిన యుద్ద ట్యాంకులను పరీక్షించామన్నారు. సైనికులకు దేశ సరిహద్దు విభాగంలో సముద్ర తీరంలో శత్రు దేశాల సేనలను సమర్ధవం తంగా ఎదుర్కొని, తిప్పి కొట్టే విధంగా అధునాతన పరిజ్ఞానంతో యుద్ద ట్యాంక్లను సిద్దం చేశామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడ యుద్దాలు జరిగినా వాటిని ఎదుర్కోగల సామార్థ్యం తమ సైనికులకు ఉందన్నారు. పరీక్షల అనంతరం ఈ యుద్ధ వాహనాలు దేశం నలుమూలల సైన్యం అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జనరల్ మేనేజర్ వేణునాధ్, అంబటి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.