హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(టిమ్స్)ను ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి హాస్పిటల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగనుంది.
ఇందులో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు అవుట్ పేషెంట్, డయాగ్నొస్టిక్స్ సేవలు అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతోపాటు మొత్తం 22 విభాగాల్లో ట్రయల్ రన్ కొనసాగనుంది.
హైదరాబాద్, ఏప్రిల్30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బీసీ కులాలను జనగణనలో ఏవిధంగా నమోదు చేస్తారనే అంశంపై స్పష్టతనివ్వాలని జనగణన డైరెక్టర్ భారతి హొళికేరిని రాష్ట్ర బీసీ కమిషన్ కోరింది. ఈ మేరకు జనగణన డైరెక్టర్కు కమిషన్ చైర్మన్ నిరంజన్ గురువారం ఒక లేఖ రాశారు. జనగణనలో భాగంగా మొదటి విడుతలో చేపట్టిన హౌస్లిస్టింగ్, మ్యాపింగ్ కాలమ్లో బీసీలు కాలమ్ లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రెండో విడుత జనాభా సేకరణలో బీసీల వివరాలను సేకరిస్తామని చెప్పడంపై అసంతృప్తిని వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని బీసీ కులాల జాబితాను డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్కు పంపించడంతోపాటు, ఆయా కులాలవారీగా వివరాలను ఏవిధంగా రెండో విడుత జాబితాలో నమోదు చేస్తారో స్పష్టంగా వివరించాలని లేఖలో కోరారు.