రఘునాథపాలెం, డిసెంబర్ 18: టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్)తో తెలంగాణ సర్కార్ది పేగుబంధమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందని తెలిపారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ గార్డెన్స్లో ఆదివారం నిర్వహించిన టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఉమ్మడి జిల్లా 3వ మహాసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి జర్నలిస్టులు ప్రాణం పోశారని అన్నా రు. స్వరాష్ట్రంలో ప్రభుత్వం జర్నలిస్టుల సం క్షేమ నిధికి రూ.100 కోట్ల నిధులు కేటాయించిందని చెప్పారు.
కరోనా సమయంలో కొవిడ్ బారిన పడిన జర్నలిస్టులకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు అందజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే తన నియోజకవర్గంలో 100 డబుల్ బెడ్రూం ఇండ్లు, మరో 100 ఇండ్ల స్థలాలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలను కలుపుకొని జర్నలిస్టుల కోసం ప్రభుత్వ స్థలాలను అన్వేషిస్తామని తెలిపారు.
మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ మాట్లాడుతూ.. 2001లో టీజేఎఫ్ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిందన్నారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు, ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతీసాగర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రమేశ్ హజారి, ఖమ్మం జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.