TS to TG | హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టీఎస్ (తెలంగాణ స్టేట్) నుంచి టీజీ (తెలంగాణ)గా వాహనాల నంబర్ ప్లేట్లు మార్చే ప్రక్రియను రవాణాశాఖ అధికారులు ముమ్మరం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ నంబర్ ప్లేట్ మార్పుపై కేంద్రానికి లేఖ కూడా రాసినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు చేసిన సవరణను కేంద్రానికి పంపాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియపై కేంద్రం సమాలోచనలు జరిపి గెజిట్ జారీచేయాల్సి ఉంటుంది. కేంద్రం గెజిట్ ఆధారంగా మళ్లీ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేస్తుంది.
అనంతరం టీజీ ప్రక్రియ రాష్ట్రంలో అమలులోకి వస్తుంది. ఈ తతంగం అంతా పూర్తికావడానికి కొంత సమయం పడుతుందని, ఈలోపు పార్లమెంట్ ఎన్నికలు పూర్తవుతాయని సమాచారం. వాహనాల రిజిస్ట్రేషన్కు ఉపయోగించే టీఎస్ స్థానంలో టీజీగా మార్చేందుకు ఈ నెల 4న రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడితే టీజీ ప్రక్రియ వేగానికి బ్రేకులు పడతాయి. ఒకవేళ నోటిఫికేషన్ ఆలస్యమైతే మరో రెండు వారాల్లో టీజీ నంబర్ ప్లేట్ వినియోగంలోకి వస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాటి సీఎం కేసీఆర్ వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఏపీ స్థానంలో టీఎస్ తీసుకొచ్చారు. టీజీ (తెలంగాణ) ఉంటే ప్రత్యేక రాష్ట్రమనే సంకేతం లేదని, టీఎస్ తీసుకురాగా, ఆ నిర్ణయాన్నీ అందరూ స్వాగతించారు. ప్రస్తుతం సీఎం రేవంత్రెడ్డి టీఎస్ నుంచి టీజీగా మార్చబోతున్నారు. రాష్ట్రంలో కోటికిపైగా వాహనాలు ఉన్నాయి. గ్రేటర్లో 80 లక్షల వాహనాలు ఉన్నాయి. టీజీ ప్లేట్లను కొత్త వాహనాలకు మాత్రమే పెట్టబోతున్నట్టు తెలుస్తున్నది. పాత వాహనాలకు కూడా టీజీ పేట్లు పెట్టడం కష్టతరమని రవాణాశాఖ అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని, వాహనాల రికార్డులు కూడా మార్చా ల్సి ఉంటుందని తెలిపారు. కార్యాలయాలకు వాహనదారులు భారీగా తరలొస్తే ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. నంబర్ ప్లేట్లు మార్చడం వల్ల వాహనదారులపై ఆర్థికంగా భారం పడుతుంది. ఉచితంగా టీజీ బదలాయింపు ప్రక్రియ చేపట్టాలని వాహ న సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.