TSPSC | నిజం నిద్రలేచేసరికి అబద్ధం అమడ దూరం ప్రయాణిస్తుందని సామెత. అదే సమయంలో నిజం నిలకడమీద తేలుతుందని కూడా చెప్తారు. టీఎస్పీఎస్సీలో ఇద్దరు వ్యక్తులు చేసిన దుర్మార్గాన్ని ఆసరాగా చేసుకొని రాష్ట్రంలో కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు ఇప్పుడు ఏకంగా అబద్ధపు యాత్రలనే కొనసాగిస్తున్నాయి. తెలంగాణలో మొత్తం ఉద్యోగ నియామక ప్రక్రియే లొసుగుల మయమన్నట్టుగా.. తెలంగాణ రాష్ట్ర సాధన నినాదమైన నీళ్లు, నిధులు, నియామకాల్లో మూడోదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అసలు పట్టించుకోనట్టుగా.. తెలంగాణ నిరుద్యోగుల కోసం సీఎం కేసీఆర్ అసలేమీ చేయనట్టుగా, రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలే నింపనట్టుగా ఇప్పుడొక దుష్ప్రచారం సాగుతున్నది.
అందని అధికారాన్ని అందుకోవడం కోసం అవాస్తవాలకు అరాచకీయాన్ని జోడించి దాన్ని సోషల్ మీడియాలో దట్టించి యువజనుల మెదళ్లను కలుషితం చేసే కార్యక్రమం ఒకటి సాగుతున్నది. రాష్ట్ర యువత కోసం నిరుద్యోగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమీ చేయలేదా? టీఎస్పీఎస్సీ పనితీరు మరీ అంత నాసిరకంగా ఉన్నదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ప్రత్యేక తెలంగాణలో నిరుద్యోగుల పరిరక్షణ మరింతగా జరగలేదా? ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసింది రాజకీయ నాయకులు కాదు, ప్రతిపక్షాల వారు అంతకంటే కాదు.
కేసీఆర్ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ చేపట్టిన చర్యలు, నిర్వహించిన పరీక్షలు, జరిపిన నియామకాల్లో పాల్గొని, పైసా లంచం ఇవ్వకుండా, పైరవీ మాటే లేకుండా వేలాది ఉద్యోగాలు పొంది వాటిని సాఫీగా చేసుకుంటున్న యువతీ యువకుల మాటే సర్కారు పనితీరుకు గీటురాయి. ఉద్యోగ నియామకాల విషయంలో అవినీతి జరిగిందా అన్నదానికి నేడు గౌరవంగా ఉద్యోగాలు చేసుకుంటున్న పలువురు పేద పిల్లల మాటే అసలు సాక్ష్యం. కేసీఆర్ ప్రభుత్వం, టీఎస్పీఎస్సీ పనితీరుపై ఈ 8 ఏండ్లలో ఉద్యోగాలు పొందిన వారి అభిప్రాయాలతో ప్రత్యేక కథనం…
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ అంటే అన్యాయాలు, అక్రమాలు.. ప్రాంతీయ వివక్ష.. స్థూలంగా అమ్ముకోవడాలు. పేరుకు నోటిఫికేషన్లు ఇవ్వడం.. సొమ్ముచేసుకోవడం ఇలా ఎన్నెన్నో జరిగేవి. కొంత మందిపై అమితమైన ప్రేమ, అస్మదీయులకు మార్కులేయడం, మిగతా వారి నోట్లో మట్టికొట్టిన ఉదంతాలెన్నో. నోటిఫికేషన్ ఇస్తే రోస్టర్ ప్రకటించరు.
ఇలా ఇక రోస్టర్ ప్రకటించకుండా నోటిఫికేషన్లు విడుదల చేసిన ఘనతలు అనాటి కమిషన్ సొంతం. చట్టబద్ధమైన ఈ సంస్థను రాజకీయ ఉపాధి కమిషన్గా మార్చిన ఉదాహరణలు కోకొల్లలు. వీటన్నింటికీ తెలంగాణ ప్రభుత్వం చెక్పెట్టింది. టీఎస్పీఎస్సీలో అనేక సంస్కరణలు చేపట్టి పారదర్శకంగా ఉద్యోగాలను భర్తీచేసింది. కానీ పాలల్లో విషం చుక్కలా ఇద్దరు వ్యక్తులు చేసిన పొరపాట్లు మొత్తం వ్యవస్థకు అప్రతిష్ఠను తెచ్చిపెట్టాయి. అవి పూర్తిగా ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పిదాలు మాత్రమే. గతంలో జరిగిన నేరాలు.. ఘోరాలు అభ్యర్థుల ఆవేదనలు చెప్పుకుంటే వర్ణణాతీతం.
2011- 14 మధ్య కాలంలో ఏపీపీఎస్సీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) నోటిఫికేషన్. తొలుత ఒక నోటిఫికేషన్ ఇచ్చి, తర్వాత మరికొన్ని పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీచేశారు. కానీ పోస్టుల రోస్టర్ను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థులంతా దరఖాస్తు చేసుకొని.. పరీక్షలు రాసి ఫలితాలు వెల్లడించిన తర్వాత నాకెందుకు ఉద్యోగం రాలేదని ఓ దివ్యాంగ కోటా అభ్యర్థి ఆరా తీస్తే రోస్టర్ ప్రకారం ఆయా పోస్టు మహిళలకే రిజర్వ్ అయ్యిందని.. పురుషులకు కాదని అధికారులు అసలు విషయం సెలవిచ్చారు. ముందే నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్లను ప్రకటించి ఉంటే ఏడాదిపాటు ప్రిపేరయ్యేవాళ్లం కాదుకదా! పరీక్ష రాసి ఉండేవాళ్లం కాదు కదా! అంటే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అంటూ నిర్లక్ష్యపు సమాధానమే అధికారుల నుంచి వచ్చింది.
కానీ ఇప్పుడు టీఎస్పీఎస్సీ కేవలం భర్తీ చేసే పోస్టులను మాత్రమే ప్రకటించకుండా నోటిఫికేషన్ తాలూకు సంపూర్ణ సమాచారాన్ని బహిర్గత పరుస్తున్నది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ను జారీచేసి.. దరఖాస్తు సమయంలో నేను నోటిఫికేషన్ను పూర్తిగా చదివాను అన్న బటన్పై క్లిక్చేస్తేనే దరఖాస్తు చేసేలా మార్పులు చేసింది. క్యాటగిరీ, రోస్టర్వారీగా పోస్టులు, అర్హతలు, పరీక్ష విధానం వివరాలను డీటెయిల్డ్ నోటిఫికేషన్లో పొందుపరుస్తున్నది. దీంతో ఆయా పోస్టులకు అర్హులైనవారు మాత్రమే దరఖాస్తు చేసుకొనే వీలు కల్పించింది.
రోస్టర్ పాటించకుండా.. ఓపెన్కోటాను నాన్లోకల్ కోటాగా మార్చి ఇష్టారీతిన పోస్టులను భర్తీచేశారు. గతంలో ఏపీపీఎస్సీ, గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పోస్టులను మాత్రమే భర్తీచేసేది. కొన్ని డిపార్ట్మెంట్లు తమకు నచ్చినట్టుగా.. నచ్చిన రూల్స్ పాటిస్తూ పోస్టులను భర్తీచేసేవి. కొన్నింటిలో ఓపెన్ కోటాలో 40, 30, 20శాతం చొప్పున పోస్టులను భర్తీచేసేవారు. డీఎస్సీల పేరుతో అంతా ఇష్టారీతిన జరిగేది.
దీనిని పూర్తిగా సంస్కరించి కొత్త జోనల్ విధానం ప్రకారం పోస్టులను విభజించింది. దీంతో ఏ పోస్టు ఏ క్యాటగిరీలోకి వస్తుందో తేల్చింది. ఓపెన్ కోటాలో జరుగుతున్న అక్రమాలకు చెక్పెట్టింది. డీఎస్సీలకు బదులుగా అన్ని పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారానే భర్తీచేసేలా జీవోలను జారీచేసింది. పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆర్అండ్బీ శాఖల్లోని అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులన్నింటికీ ఒకే నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నది. గురుకుల, పోలీస్ ఉద్యోగాలు మినహా గ్రూప్స్ ఉద్యోగాలతోపాటు ఉపాధ్యాయ, మిగతాశాఖల్లోని పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీయే భర్తీచేస్తున్నది.
నల్లగొండ జిల్లాకు చెందిన కే వెంకటేశ్వర్లు ఏపీపీఎస్సీ ద్వారా 1997లో స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) ఉద్యోగానికి 1:2 జాబితాలో చోటు దక్కించుకొన్నాడు. ఇంట ర్వ్యూ పూర్తయ్యాక తనకు కచ్చితంగా ఉద్యోగం వస్తుందన్న నమ్మకంతో ఉన్న శర్మ జాబితాను పరిశీలించి అవాక్కయ్యాడు. 6వ జోన్ అయిన నల్లగొండ జిల్లా పోస్టును 4వ జోన్లోని గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన ఓ అభ్యర్థికి కట్టబెట్టారు. ఇదేంటని అడిగితే బయటికెళ్లంటూ అధికారుల నుంచి సమాధానం.
స్వరాష్ట్రంలో పౌరులంతా సమాన ఫలాలను అందిపుచ్చుకొనేందుకు ప్రభుత్వం కొత్త జోనల్ విధానాన్ని అమలు చేస్తున్నది. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చట్టంలో మార్పులు చేసింది. దీంతో ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల పరంపరకు శాశ్వత ముగింపు పలికింది. అటెండర్ నుంచి ఆర్డీవో స్థాయి వరకు అన్ని ఉద్యోగాలు తెలంగాణ బిడ్డలకే దక్కేలా ఉత్తర్వులిచ్చింది. గతంలో స్టేట్ క్యాడర్, మల్టిజోన్ పోస్టుల సాకుతో లోకల్ రిజర్వేషన్ను వర్తింపజేయకుండా తెలంగాణకు చేసిన అన్యాయాలను పూర్తిగా తుడిచివేసింది. ఆర్డీవో, సీటీవో, డీఎస్పీ, జిల్లా రిజిస్ట్రార్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ వంటి ఉద్యోగాలను స్టేట్ పోస్టుల పేరుతో స్థానికేతరులు కొల్లగొట్టగా, ఈ సంప్రదాయాన్ని పూర్తిగా అంతం చేసింది. అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి టీఎస్పీఎస్సీలో హెల్ప్డెస్క్ను ఏర్పాటుచేసింది. అభ్యర్థుల వినతులను స్వీకరిస్తున్నది.
ఒకే ఒక్క మార్కు.. ఈ మార్కులతోనే తలరాతలే మారిపోతాయి. ఉద్యోగాల తీరే మారిపోతుంది. ఇందుకు ఈ వ్యక్తే ఉదాహరణ. గ్రూప్-1 మెయిన్స్లో తెలంగాణ అభ్యర్థికి 900 మార్కులకు 679 వచ్చాయి. రాష్ట్రస్థాయిలో ఇవి రెండో అత్యధిక మార్కులు. ఆయనకు ఇంటర్వ్యూలో కేవలం 28 మార్కులే వేశారు. డిప్యూటీ కలెక్టర్ కావాల్సిన ఆయన ఒక్క మార్కు తేడాతో మరో పోస్టును పొందాల్సి వచ్చింది. మరో అభ్యర్థికి మెయిన్స్లో 900 మార్కులకు 535 వస్తే ఇంటర్వ్యూలో 90 మార్కులకు 88 మార్కులు వేశారు. ఇంటర్వ్యూలో 90 శాతానికి మించి మార్కులు వేయకూడదు. కానీ సదరు అభ్యర్థికి 98 శాతం మార్కులు వేశారు. ఓ అభ్యర్థికి ఇంటర్వ్యూలో సున్నా మార్కులు వేయడం అప్పట్లో జరిగిన అన్యాయాలు, అక్రమాలకు మరో పరాకాష్ట. సున్నా మార్కులు వచ్చిన అభ్యర్థి హైకోర్టుకు వెళ్తే అప్పటికప్పుడు కొన్ని మార్కులు వేసి పోస్టింగ్ ఇచ్చారు.
ఇంటర్వ్యూలతో జరుగుతున్న అన్యాయాలకు చెక్పెట్టేందుకు అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దుచేసింది. గతంలో గ్రూప్-2 సహా ఇతర ఉద్యోగాల భర్తీకి అనుసరించిన ఇంటర్వ్యూ విధానాన్ని పూర్తిగా రద్దుచేసింది. తాజాగా నిరుడు గ్రూప్-1 పోస్టుల భర్తీకి సైతం ఇంటర్వ్యూతో నిమిత్తం లేకుండా పూర్తిగా ప్రతిభావంతులే ఉద్యోగాలు దక్కించుకొనే అవకాం ఇచ్చింది. ఇంటర్వ్యూల రద్దుతో తాము సైతం ప్రభుత్వ ఉద్యోగాల పొందగలమన్న ధీమాను సామాన్యులకు కల్పించింది.
2013లో ఏపీపీఎస్సీ ఉద్యోగాలను బహిరంగ మార్కెట్లో అమ్మినట్టుగా బేరానికి పెట్టి సంధ్యారాణి అనే మహిళ ఓ టీవీ చానల్కు రెడ్హ్యాండెడ్గా దొరికింది. ఇది అప్పట్లో పెద్ద సంచనలం కాగా, రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఒక్కో పోస్టుకు రూ.10 లక్షలకు బేరంపెట్టగా, దాంట్లో ఏపీపీఎస్సీ సభ్యుడు ఒకరు తనకు రూ.2.5 లక్షలు కమీషన్ ఇస్తానని హామీ ఇచ్చినట్టు ఆమె బహిరంగంగా ఒప్పుకున్నది. 2013లో ఏపీపీఎస్సీ సభ్యులుగా ఉన్నవారిలో అత్యధికులు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారే.
నంద్యాల మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, ఆదిలాబాద్ జడ్పీ ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసిన వ్యక్తి, సత్తెనపల్లిలో కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నించిన వారిని టీఎస్పీఎస్సీ సభ్యులుగా నియమించిన దాఖలాలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ సభ్యుడిగా పనిచేసిన రిపుంజయరెడ్డి ఏసీబీ కేసులో ఇరుక్కొన్నాడు. 1980లో రాజాజీ అనే ఐఏఎస్ అధికారిని ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమించారు. సమర్థుడిగా నిప్పులాంటి మనిషిగా పేరు తెచ్చుకొన్న ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ పనిచేశారు. కమిషన్ చైర్మన్గా నియమితులైన మూడు నెలలకే ఆయన రాజీనామా చేశారు. అక్రమాలను సహించలేక, లొంగలేక బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.
టీఎసీపీఎస్సీ తొలి చైర్మన్గా దళితుడు, ప్రొఫెసర్, ఉద్యమకారుడు, మేధావి ఘంటా చక్రపాణిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. పేద విద్యార్థుల కష్టనష్టాలు తెలిసిన ఆయనను తొలి చైర్మన్గా నియమించి నియామకాలు చేపట్టింది. సభ్యులుగా ఉద్యోగ సంఘాల నేత సీ విఠల్, సామాజిక కార్యకర్త మతీనుద్దీన్ ఖాద్రీ, విద్యారంగంలో సుధీర్ఘ అనుభమున్న మన్మధరెడ్డి, జడ్జిగా పనిచేసిన మంగారి రాజేందర్, ప్రొఫెసర్ చింతా సాయిలు, కృష్ణారెడ్డిని సభ్యులుగా నియమించింది. రెండో దఫాలోనూ 30 ఏండ్ల ఉద్యోగ జీవితంలో మచ్చలేని, సమర్థుడు, అత్యంత విశ్వసనీయత గల ఐఏఎస్ అధికారి జనార్దన్రెడ్డిని చైర్మన్గా నియమించింది. సభ్యులుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టీఎన్జీవో సంఘం నేత కారం రవీందర్రెడ్డి, ప్రొఫెసర్ బండి లింగారెడ్డి, జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, ఉపాధ్యాయురాలు, ఉద్యమకారిణి సుమిత్రానంద్ తనోబా, ఇంజినీరింగ్ నిపుణుడు, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ధన్సింగ్, రెవెన్యూలో కీలక అనుభవమున్న కోట్ల అరుణకుమారిని నియమించింది.
టీఎస్పీఎస్సీ తక్షణమే నష్టనివారణ చర్యలు చేపట్టడం స్వాగతించాల్సిన అంశం. పరీక్షలను రద్దుచేసి మంచి పనిచేశారు. లేదంటే అనుమానాలు మరింత బలపడేవి. అత్యంత పకడ్బందీగా నియమకాలు చేపట్టిన చరిత్ర టీఎస్పీఎస్సీది. ప్రశ్నాపత్రాల రూపకల్పన.. ఫలితాల విడుదల వంటి కాన్ఫిడెన్షియల్ పనులు సెక్రటరీ, చైర్మన్లు మాత్రమే చూస్తారు. దీంట్లో మూడో వ్యక్తి ప్రమేయముండేది కాదు. నేను సభ్యుడిగా ఉన్నా ఈ విషయాలు నాకు కూడా తెలిసేవి కావు. ఇద్దరు చేసిన తప్పిదంతో వ్యవస్థకు నష్టం జరిగింది.
– బీ మన్మధరెడ్డి, టీఎస్పీఎస్సీ పూర్వసభ్యుడు