హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలను అదుపు చేయడంలో విఫలమైనందుకు పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేయడంతోపాటు శాఖాపరమైన విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటు వేసి, 12 మంది పోలీసు అధికారులపై సస్పెండ్ చేసింది. షోకాజ్ నోటీసులు అందుకున్న ఏపీ సీఎస్ జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమార్గుప్తా, ఇంటెలిజెన్స్ చీఫ్ కుమార్ విశ్వజిత్ గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఓట్ల లెక్కింపు జరిగే వరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు, అల్లర్లు జరగకుండా సీఆర్పీఎఫ్ బలగాలతో భద్రత కల్పించాలని హోంశాఖకు ఈసీ సూచించింది.