హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరా చేస్తామని నీటిపారుదల శాఖకు ట్రా న్స్కో తేల్చిచెప్పింది. ఆ శాఖ ఉన్నతాధికారులకే ఈ విషయాన్ని స్పష్టంచేసింది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం ఏకంగా రూ.4,764 కోట్ల మేర బకాయి పడ్డది. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఇరిగేషన్ శాఖ పెడచెవిన పెడుతూ వస్తున్నది. దీంతో ట్రాన్స్కో తాజాగా కరెంట్ సరఫరాను నిలిపేసింది. ఫలితంగా కీలకదశలో పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. ఇప్పటికే పలు పంప్హౌస్లలో మోటర్లను నడిపేందుకు అనుమతులనూ నిరాకరించింది. మరికొన్ని చోట్ల పగటిపూట మాత్రమే కరెంట్ సరఫరా చేస్తూ రాత్రిపూట పూర్తిగా బంద్ పెడుతున్నది. దీంతో రిజర్వాయర్లు, ప్రాజెక్టుల్లో నీటి వనరులున్నా కూడా పంప్హౌస్లు మా త్రం సామర్థ్యం మేరకు పనిచేయని పరిస్థితి నెలకొన్నది. దీంతో సాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. లిఫ్ట్ పథకాలు అంతంత మాత్రంగానే పనిచేస్తున్నాయి.
రాష్ట్రంలో సాగునీటి పారుదల శాఖ పలు మేజర్ ప్రాజెక్టులను చేపట్టింది. లిఫ్ట్ స్కీమ్లను ఏర్పాటుచేసింది. కాళేశ్వరం, పాలమూరు- రంగారెడ్డి, దేవాదుల, కల్వకుర్తి, రా జీవ్భీమా తదితర లిఫ్ట్లు కొనసాగుతున్నా యి. వాటి పరిధిలో ఆయకట్టుకు నీరందించడంలో ఆయా ప్రాజెక్టులదీ కీలకపాత్ర. ఆయా పంప్హౌస్ల నిర్వహణకు ప్రత్యేకంగా సబ్స్టేషన్లను ఏర్పాటుచేసింది. ట్రాన్స్మిషన్ లైన్లను నెలకొల్పింది. ట్రాన్స్కో విభాగం విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉన్నది. ట్రాన్స్కో విభాగానికి ప్రభుత్వం రూ.4,764 కోట్లు బకాయి పడ్డది. ఇప్పటికే పూర్తయిన లిఫ్ట్ స్కీమ్ల పనులకు గాను 863.51 కోట్లు, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పలు ప్రాజెక్టులకు సంబంధించి పంప్హౌస్ల నిర్మాణం, విద్యుత్తు సరఫరా కోసం రూ.3,900.81 కోట్లు కలిపి మొత్తంగా రూ.4,764.32 కోట్ల నిధులను ట్రాన్స్కోకు ఇరిగేషన్ శాఖ చెల్లించాల్సి ఉంది. కరెంటు సరఫరాను నిలిపివేసిన ట్రాన్స్కో.. బకాయి బిల్లులు చెల్లిస్తేనే విద్యుత్తు సరఫరాను పునరుద్ధరిస్తామని ఇరిగేషన్శాఖకు తెగేసి చెప్పింది.
ప్రస్తుతం గోదావరి బేసిన్లో సమ్మక్కసాగర్, శ్రీరాంసాగర్, ఎల్లంపల్లి, మిడ్మానేరు, అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ జలాశయాలతోపాటు కృష్ణా బేసిన్లో జూరాల, శ్రీశైలం, సాగర్తోపాటు అన్ని మధ్యతరహా ప్రాజెక్టుల్లో ఆశించిన స్థాయిలోనే నీటినిల్వలు ఉన్నాయి. ఆయా జలాశయాల ఆధారంగా పలు లిఫ్ట్ పథకాలు కొనసాగుతున్నాయి. కానీ విద్యుత్తు సరఫరాను ట్రాన్స్కో నిలిపివేయడంతో ప్రస్తుతం ఆయా లిఫ్ట్ పథకాలను వినియోగించని, నీటి ఎత్తిపోతలను కొనసాగించలేని దుస్థితి నెలకొన్నది. దేవాదుల పథకానిదీ ఇదే దుస్థితి. రిజర్వాయర్లలో నీళ్లున్నా కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొన్నది. జిల్లాకు చెందిన మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకున్నా.. కేవలం పగటిపూట, అది కూడా కొన్నిగంటలు మాత్రమే ట్రాన్స్కో విద్యుత్తు సరఫరా చేస్తున్నది. ఫలితంగా డిమాండ్, పంప్హౌస్ల సామర్థ్యం మేరకు నీటిని ఎత్తిపోయలేని పరిస్థితి ఏర్పడింది. వెరసి కీలక దశలో సాగునీరందక పంటలు ఎండిపోతున్న దుర్భర పరిస్థితి దాపురించింది. క్షేత్రస్థాయి పరిస్థితిని ట్రాన్స్కో అధికారులకు విన్నవించినా కూడా విద్యుత్తు సరఫరాకు అంగీకరించడం లేదని ఇంజినీర్లు వివరిస్తున్నారు. ట్రాన్స్కో ఉన్నతాధికారులనే సంప్రదించాలని వారు కరాఖండిగా తేల్చి చెప్తున్నారని వివరిస్తున్నారు. ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు సంప్రదించినా ఫలితం లేకుండా పోయిందని తెలుస్తున్నది. ప్రభుత్వ స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని ఇంజినీర్లు చెప్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ లిఫ్ట్ పథకాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. కల్వకుర్తి, రాజీవ్భీమాలోని 4 పంపింగ్ స్టేషన్ల చొప్పున, నెట్టెంపాడులోని 3 పంపింగ్ స్టేషన్లతోపాటు కోయిల్సాగర్, అలీసాగర్, గుత్పా, చౌటుపల్లి హన్మంతరెడ్డి, తదితర కీలక పంపింగ్ స్టేషన్లదీ అదే దుస్థితి. ఆయా పంపింగ్ స్టేషన్ల నిర్వహణకు సంబంధించి ఏజెన్సీలకు ప్రభుత్వం సకాలంలో నిధులను విడుదల చేయకపోవడంతో నీటి ఎత్తిపోతలు అంతంత మాత్రంగానే కొనసాగుతున్నది. నెలల తరబడి జీతాలు చెల్లించకపోవడంతో ఆయా పంపింగ్స్టేషన్లలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిలో కొందరు పూర్తిగా మానేయగా, మరికొందరు విధులను బహిష్కరిస్తున్న దుస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న సిబ్బందితో కాంట్రాక్టర్లు అరకొరగానే నీటి ఎత్తిపోతలను కొనసాగిస్తున్నట్టు అర్థమవుతున్నది. పలుచోట్ల దీర్ఘకాలికంగా ఎత్తిపోతలనే నిలిపివేసినట్టు అధికారులు వాపోతున్నారు. నీటి ఎత్తిపోతలు లేకపోవడంతో ఆయా పంపింగ్స్టేషన్ల పరిధిలోని ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొన్నది. సమృద్ధిగా వర్షాలు కురిసినా కూడా ప్రభుత్వ పట్టింపులేనితనంతో యాసంగి పంటలు నేడు చేతికందని దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకొని నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కొనసాగేలా చొరవ చూపాలని ఇరిగేషన్ అధికారులు కోరుతున్నారు. మరింత ఆలస్యమైతే పంటలు పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్తును పగటి పూట మాత్రమే సరఫరా చేసి, రాత్రిపూట బంద్ చేయడం వల్ల మోటర్లను పదే పదే ఆన్ చేయాల్సి వస్తున్నదని, ఫలితంగా దీర్ఘకాలంలో అవి కూడా దెబ్బతినే ప్రమాదం ఉన్నదని హెచ్చరిస్తున్నారు.