హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలతో శుక్రవారం దాదాపు పది గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోగా, రాత్రి 8 గంటల తర్వాత రైళ్లను పునరుద్ధరించారు. ఉదయం 9 గంటల నుంచి రైళ్ల రాకపోకలు ఆగిపోయాయి. సాధారణ పరిస్థితులు నెలకొనటంతో రైల్వే ట్రాక్ల మరమ్మతులు చేపట్టారు.
ఫిట్నెస్ తనిఖీలు చేసి రైళ్లను పునరుద్ధరించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చాక రాత్రి 8.10 గంటలకు కాకినాడ ఎక్స్ప్రెస్ను పునరుద్ధరించారు. ఆ తర్వాత హైదరాబాద్- విశాఖపట్నం, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్ -తాంబరమ్, విశాఖపట్నం-హైదరాబాద్, తాంబరమ్-హైదరాబాద్ స్టేషన్లకు సంబంధించిన రైళ్ల రాకపోకలు ప్రారంభించినట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొన్నది.