హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ)/రామవరం: దేశంలో అత్యంత కీలకమైన రైల్వే లైన్లను కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుశేరు లెక్కన అమ్మేస్తుంటే.. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తానై కొత్త రైల్వే లైన్ల నిర్మాణాన్ని పూర్తిచేయిస్తున్నది. పర్యావరణహితంగా బొగ్గు రవాణా చేయాలన్న లక్ష్యంలో భాగంగా కొత్తగూడెం-సత్తుపల్లి మధ్య 54.10 కిలోమీటర్ల రైలు మార్గాన్ని కేవలం రెండేండ్లలోనే పూర్తిచేయటం విశేషం. ఈ మార్గాన్ని సింగరేణి, దక్షిణమధ్య రైల్వే రూ.927.94 కోట్లతో సంయుక్తంగా నిర్మించాయి. ఇందులో రూ.309.39 కోట్లు దక్షిణమధ్య రైల్వే భరించగా, తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ద్వారా 618.55 కోట్లు ఖర్చుచేసింది.
శనివారం సత్తుపల్లి నుంచి బొగ్గు లోడుతో తొలి రైలును ఈ మార్గంలో ప్రయోగాత్మకంగా కొత్తగూడెంకు నడిపారు. సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్ చంద్రశేఖర్ జెండా ఊపి రైలును ప్రారంభించారు. సత్తుపల్లి, కిష్టారం ఓపెన్ కాస్ట్ గనుల నుంచి రోజుకు 30 వేల టన్నుల చొప్పున ఏటా 100 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేయాలన్న లక్ష్యంతో ఈ మార్గాన్ని నిర్మించినట్టు సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే నిర్మించిన మార్గాల్లో అతి తకువ సమయంలో పూర్తయిన మార్గంగా ఇది రికార్డు సృష్టించిందని చెప్పారు. సీహెచ్పీ యార్డులో అవసరమైన 10.17 కిలోమీటర్ల లైన్లను రూ.180 కోట్ల సొంత నిధులతో సింగరేణి నిర్మించినట్టు వెల్లడించారు. సత్తుపల్లి నుంచి కొత్తగూడెం (రుద్రంపూర్) ఆర్సీహెచ్పీకి ఈ మార్గం గుండా చేరే బొగ్గు, అక్కడి నుంచి పాల్వంచ థర్మల్ పవర్ స్టేషన్తోపాటు ఇతర థర్మల్ స్టేషన్లకు రవాణా అవుతుంది.