లక్షెట్టిపేట/లక్షెట్టిపేట రూరల్ : చిన్నపాటి గొడవ ఇద్దరి ప్రాణాలను బలితీసుకున్నది. ఇంటి సమీపంలోని మహిళ తిట్టిందని ఓ వివాహిత పురుగుల మందు తాగి చనిపోగా, ఆమె మృతదేహాన్ని తీసుకొస్తున్న అంబులెన్స్ వెనుకాలే బయలుదేరిన భర్త సైతం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది.
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన రేఖేందర్ మల్లికార్జున్(31) రేఖేందర్ శరణ్య(28) దంపతులు. వీరికి ఓంకార్ (6), ఇవాంక(4) ఇద్దరు చిన్నారులున్నారు. భర్త మల్లికార్జున్ ఎప్పటిలాగే శనివారం ఉదయం లారీ నడిపేందుకు వెళ్లాడు. ఇంటి సమీపంలోని వావిలాల రజని ..శరణ్యను అకారణంగా దూషించడం మొదలు పెట్టింది. ఇది విన్న శరణ్య ఆమె ఇంటికి వెళ్లి ఎందుకు తిడుతున్నావంటూ ప్రశ్నించింది. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన రజని.. శరణ్యపై చేయి చేసుకుంది.
ఆ తర్వాత వరుసకు పిన్ని అయిన రేఖేందర్ రాణి ప్రోత్సాహంతో రజని లక్షెట్టిపేట పోలీస్స్టేషన్లో .. శరణ్యపై ఫిర్యాదు చేసింది. అక్కడికి చేరుకున్న శరణ్యను మరోసారి తిట్టగా, తీవ్ర మనస్తాపానికి గురై ఇంటికి వచ్చి మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఆమెను హూటాహుటినా లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 6 గంటలకు శరణ్య మరణించింది.
శరణ్య మృతదేహంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్లో తిరిగి ఎల్లారం గ్రామానికి బయలుదేరగా ఆ వెనుకాలే మల్లికార్జున్, అతడి వరుసకు తమ్ముడయ్యే వ్యక్తితో కలిసి బయలు దేరారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో లక్షెట్టిపేటకు చేరుకోగానే మూత్ర విసర్జనకు మల్లికార్జున్ రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని లక్షెట్టిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీని పోలీస్స్టేషన్కు తరలించి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. అంతకుముందు మల్లికార్జున్ ఇచ్చిన ఫిర్యాదుతో వావిలాల రజనితో పాటు రేఖేందర్ రాణిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం భార్యభర్తలిద్దరికీ అంత్యక్రియలు పూర్తి చేశారు. తల్లిదండ్రుల మృతితో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారడంతో స్థానికులు కంట తడి పెట్టుకున్నారు.