కుమ్రంభీం ఆసిఫాబాద్, డిసెంబర్ 30 (నమస్తేతెలంగాణ)/అంబేద్కర్ చౌక్ : ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సరైన గిట్టుబాటు ధర కల్పించడం లేదంటూ రైతులు కన్నెర్ర చేశారు. శుక్రవారం వారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నాకు దిగారు. గ్రామాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు జిల్లా కేంద్రంలో ర్యాలీ తీస్తూ అంబేద్కర్ చౌక్ వద్దకు చేరుకొన్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఆందోళన మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగింది. నాలుగు గంటలపాటు రాకపోకలు స్తంభించిపోయాయి. సీసీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులు మాట్లాడుతూ.. ప్రారంభంలో క్వింటాల్ పత్తికి రూ.8,600 చెల్లించిన వ్యాపారులు క్రమంగా ధర తగ్గించి ప్రస్తుతం రూ.7,500కు కొనుగోలు చేస్తున్నారని,
ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి క్వింటాల్కు రూ. 12 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్ రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వారు వినిపించుకోలేదు. ఆపై ర్యాలీగా కలెక్టరేట్కు చేరుకున్నారు. సీసీఐ, వ్యాపారులతో మాట్లాడి తమకు న్యాయం జరిగేలా చూడాలని వారు కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతిపత్రం అందజేశారు. సీసీఐ అధికారులతోపాటు జిన్నింగ్ వ్యాపారులతో సమావేశం నిర్వహించి గిట్టుబాటు ధర కల్పించేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.