హైదరాబాద్: నూతన సంవత్సరం వేడుకల దృష్ట్యా హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు. ఆదివారం రాత్రి 10 నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉంటాయి. అదేవిధంగా మూడు కమిషనరేట్ల పరిధిలోని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 అర్థరాత్రి దాటే వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ (ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు) వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, ఓఆర్ఆర్పై రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయనున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే ఔటర్ రింగ్ రోడ్డుపై అనుమతించనున్నారు. రాత్రి 8 గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహింస్తామని పోలీసులు ప్రకటించారు.
నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని మెట్రో రైళ్ల వేళలను పొడిగించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి వరకు నగరవాసులంతా సంబురాల్లో పాల్గొంటున్న నేపథ్యంలో రాత్రి 11 గంటల వరకు అందుబాటులో ఉండే రైళ్లను 1 గంట వరకు నడుపుతున్నట్లు చెప్పారు.
చివరి రైళ్లు ప్రారంభ స్టేషన్ నుంచి రాత్రి 12.15 గంటలకు బయలుదేరి, ఆఖరి స్టేషన్కు ఒంటి గంట సమయంలో చేరుకుంటాయన్నారు. నగరవాసులు బాధ్యతాయుతంగా ప్రయాణం చేయాలని, ప్రయాణికులు మద్యం సేవించి, దుర్భాషలాడకుండా మెట్రో రైలు పోలీసులు, సెక్యూరిటీ వింగ్లు నిఘా ఉంచుతాయని స్పష్టం చేశారు.