హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను (Telangana Formation day) ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని (Hyderabad) సెక్రటేరియట్ (Secretariat) పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. పలు రూట్లలో వాహనాలను దారిమళ్లించనున్నారు. ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్డు, లుంబినీ పార్కును మూసేస్తారు. ఈ సందర్భంగా సచివాలయం, గన్పార్కు పరిసరాల్లో, ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఆ మార్గాల్లో నిర్ణీత కాలంలో రాకపోకలు సాగించకుండా వాహనదారులు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు.
అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్ద కూడా వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆ రూట్లో రాకపోకలు సాగించే వాహనాలను కొద్దిసేపు నిలిపివేయనున్నారు. పంజాగుట్ట నుంచి రాజ్భవన్ వైపు, సోమాజిగూడ నుంచి వీవీ విగ్రహం వైపు, అయోధ్య నుంచి నిరంకారి, రవీంద్ర భారతి నుంచి ఇక్బాల్ మినార్, ఇక్బాల్ మినార్ నుంచి ఓల్డ్ సైఫాబాద్ పీఎస్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి రవీంద్రభారతి, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ నుంచి ఇక్బాల్ మినార్ వైపు, బీజేఆర్ విగ్రహం, నాంపల్లి వైపు నుంచి రవీంద్రభారతి, పీసీఆర్ జంక్షన్, బషీర్బాగ్ జంక్షన్ వైపు నుంచి వచ్చే వాహనాలను కొద్ది సేపు నిలిపివేస్తారు.